తూత్తుకుడి కాల్పుల ఘటన.. 30 మందికి సమన్లు
ABN , First Publish Date - 2021-10-22T12:59:34+05:30 IST
తూత్తుకుడి తుపాకీ కాల్పుల ఘటనకు సంబంధించిన 31వ విడత విచారణను మాజీ న్యాయమూర్తి అరుణా జగదీశన్ ప్రారంభించారు. తహసీల్దార్, వైద్యులు తదితర 30 మంది విచారణకు హాజరుకావాలని సమన్లు జారీచేశారు.
పెరంబూర్(Chennai): తూత్తుకుడి తుపాకీ కాల్పుల ఘటనకు సంబంధించిన 31వ విడత విచారణను మాజీ న్యాయమూర్తి అరుణా జగదీశన్ ప్రారంభించారు. తహసీల్దార్, వైద్యులు తదితర 30 మంది విచారణకు హాజరుకావాలని సమన్లు జారీచేశారు. తూత్తుకుడిలో గత 2018లో స్టెరిలైట్ కర్మాగారానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతిచెందారు. ఈ ఘటనపై మాజీ న్యాయమూర్తి అరుణా జగదీశన్ నేతృత్వంలోని కమిషన్ విచారణ చేపట్టింది. ఇప్పటికే 30 విడతలుగా 962 మందిని విచారించారు. ఈ నేపథ్యంలో, కమిషన్ 31వ విడత విచారణ తూత్తుకుడి ప్రభుత్వ అతిథిగృహం ప్రాంగణంలోని కమిటీ కార్యాలయంలో ప్రారంభమైంది. తుపాకీ కాల్పుల సమయంలో విధుల్లో ఉన్న కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఘటనలో మృతిచెందిన వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు, వేలిముద్రల నిపుణులు, తుపాకీ కాల్పులకు ఆదేశించిన తహసీల్దార్లు అని మొత్తం 30 మందికి సమన్లు జారీచేశారు. ఈ విచారణ ఈనెల 26వ తేదీ వరకు కొనసాగుతుందని కమిషన్ అధికారులు తెలిపారు.