భార్యతో చనువుగా ఉన్నాడని హత్య

ABN , First Publish Date - 2021-04-11T03:53:56+05:30 IST

తన భార్యతో చనువుగా ఉన్నాడన్న కోపంతో ఓ వ్యక్తిని మరో వ్యక్తి ఇంకొకరితో కలిసి తలపై బండరాయతో మోది హత్య చేశాడు. ఈ కేసులో బాలాజీనగర్‌ పోలీసులు శనివారం ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు.

భార్యతో చనువుగా ఉన్నాడని హత్య
మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి

ఉస్మాన్‌ హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి

నెల్లూరు(క్రైం) : ఏప్రిల్‌ 10:  తన భార్యతో చనువుగా ఉన్నాడన్న కోపంతో ఓ వ్యక్తిని మరో వ్యక్తి ఇంకొకరితో కలిసి తలపై బండరాయతో మోది హత్య చేశాడు. ఈ కేసులో బాలాజీనగర్‌ పోలీసులు  శనివారం ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. నగర డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి ఆ వివరాలను వెల్లడించారు. ‘నగరంలోని బాలాజీనగర్‌ గౌడహాస్టల్‌ ప్రాంతంలో ఎస్‌కే ఉస్మాన్‌(36) పెయింట్‌ పనులు చేసుకూంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య మూడేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం ఖత్తర్‌కు వెళ్లింది. అప్పటి నుంచి ఉస్మాన్‌ మద్యానికి బానిసయ్యాడు. అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్‌ శివకుమార్‌తో సన్నిహితంగా ఉంటూ ఇద్దరు కలిసి మద్యం తాగుతూ తరచూ గొడవలు పడేవారు. ఇదిలా ఉంటే  తన భార్యతో ఉస్మాన్‌ సన్నిహితంగా ఉన్నాడని శివకుమార్‌ మనసులో కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 6న మద్యం మత్తులో ఉన్న ఉస్మాన్‌ను శివకుమార్‌ తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తూ దారిలో తన స్నేహితుడు దామవరపు వినీత్‌ను వెంట పెట్టుకొని బాలాజీనగర్‌ ఎస్‌బీఐ కాలనీలో గల వెంకట్‌రెడ్డి లే అవుట్‌ వద్దకెళ్లారు. అక్కడ ఉస్మాన్‌పై వారు దాడికి పాల్పడ్డారు. బండరాయితో తలపై మోదినా ఉస్మాన్‌ మృతి చెందక పోవడంతో మరో రెండు సార్లు తలపై విచక్షణా రహితంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో వారు అక్కడ నుంచి పరారయ్యారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం జాతీయరహదారిపై పల్లిపాలెం క్రాస్‌రోడ్డు వద్ద ఆ ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు.  నిందితుల ద్విచక్ర వాహనం, హత్యకు ఉపయోగించిన బండరాయిని స్వాధీనం చేసుకున్నారు’ అని డీఎస్పీ వివరించారు. కేసును ఛేదించిన బాలాజీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ మంగారావు, ఏఎస్సై లక్ష్మీపతిరావు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

Updated Date - 2021-04-11T03:53:56+05:30 IST