మనీలాండరింగ్ కేసులో ఇద్దరు చైనీయుల అరెస్టు
ABN , First Publish Date - 2021-01-18T07:27:27+05:30 IST
సుమారు రూ. 1000 కోట్ల విలువైన హవాలా కుంభకోణంలో నగదు అక్రమ రవాణా చేశారన్న ఆరోపణలపై ఇద్దరు చైనా దేశస్థుల్ని
న్యూఢిల్లీ, జనవరి 17: సుమారు రూ. 1000 కోట్ల విలువైన హవాలా కుంభకోణంలో నగదు అక్రమ రవాణా చేశారన్న ఆరోపణలపై ఇద్దరు చైనా దేశస్థుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం అదుపులోకి తీసుకుంది. వారిని చార్లీ పెంగ్ అలియాస్ లువో సాంగ్(42), కార్టర్ లీగా అధికారులు గుర్తించారు. నకిలీ సంస్థల ద్వారా వీరిద్దరూ డబ్బును రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం స్థానిక కోర్టులో నిందితులను హజరుపరిచారు. నిందితుల్లో ఒకరైన పెంగ్ సూచనల మేరకే హిమాచల్ ప్రదేశ్లోని దలై లామా కదలికలపై ఇద్దరు వ్యక్తులు నిఘా వేశారని, గత ఏడాది ఆ ఇద్దరూ పట్టబడటంతో పెంగ్ పేరు బయటికి వచ్చిందని అధికారులు తెలిపారు. అంతేకాక, గత ఏడాది ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తులోనూ, ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఎఫ్ఐఆర్ నమోదులోనూ పెంగ్ పేరు వినిపించింది. నిరుడు ఆగస్టులో పెంగ్, అతని సహచరులపై ఐటీ శాఖ జరిపిన దాడుల్లో నకిలీ పాస్పోర్టు లభ్యమైనట్లు సమాచారం. చైనా నుంచి హవాలా నిధులను భారత్లోకి యథేచ్చగా తరలించేందుకు గాను, ఏకంగా నకిలీ సంస్థల నెట్వర్క్నే పెంగ్ సృష్టించాడని అధికారులు చెబుతున్నారు.