మనీలాండరింగ్ కేసులో ఇద్దరు చైనీయుల అరెస్ట్
ABN , First Publish Date - 2021-01-18T00:35:49+05:30 IST
డొల్ల కంపెనీలు, హవాలా రాకెట్ కేసులో ఇద్దరు చైనీయులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
న్యూఢిల్లీ : డొల్ల కంపెనీలు, హవాలా రాకెట్ కేసులో ఇద్దరు చైనీయులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. వీరిని కోర్టు 14 రోజుల కస్టడీకి పంపించింది. ఈడీ అధికారులు ఆదివారం తెలిపిన సమాచారం ప్రకారం బూటకపు కంపెనీలకు సంబంధించిన రూ.1,000 కోట్ల హవాలా రాకెట్పై ఈడీ దర్యాప్తు చేస్తోంది. మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపిస్తూ చార్లీ పెంగ్ వురపు లువో సంగ్ (42), కార్టర్ లీ అనే ఇద్దరు చైనీయులను మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం జనవరి 15న అరెస్ట్ చేశారు. వీరిద్దర్నీ స్థానిక కోర్టులో శనివారం ప్రవేశపెట్టారు.
గత ఏడాది ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన దర్యాప్తు, 2018లో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసును పెంగ్పై నమోదు చేశారు. హిమాచల్ ప్రదేశ్లో గత ఏడాది అరెస్టయిన ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో పెంగ్ పేరు బయటకు వచ్చింది. టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలై లామా కదలికలను ఈ ఇద్దరూ గమనిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ చైనా జాతీయుడితోపాటు అతని సహచరులు, బ్యాంకర్లపై గత ఏడాది ఆగస్టులో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, పెంగ్ రెండు, మూడేళ్ళ నుంచి హవాలా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా బూటకపు కంపెనీలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీల ద్వారా చైనా నుంచి మన దేశానికి, మన దేశం నుంచి చైనాకు నిధులను హవాలా మార్గాల్లో పంపిస్తున్నట్లు తెలుస్తోంది.