రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
ABN , First Publish Date - 2021-01-21T05:40:47+05:30 IST
సూర్యాపేట జిల్లాలో బుధవారం జరిగిన వేర్వురు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు.
హుజూర్నగర్ /తిరుమలగిరి రూరల్, జనవరి 20: సూర్యాపేట జిల్లాలో బుధవారం జరిగిన వేర్వురు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. హుజూర్నగర్ కొత్త బస్టాండ్ వద్ద పట్టణానికి చెందిన షేక్ మౌలానా(70) సాయంత్రం మల్లన్ననగర్ నుంచి బైక్పై వస్తుండగా కొత్త బస్టాండ్ వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన అతనిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కోదాడకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మౌలానాకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు. తిరుమలగిరి మండలం మామిడాల వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొని యువకుడు మృతిచెందాడు. యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు చెందిన రుద్రాక్ష శ్రవణ్కుమార్(23) స్నేహితుడితో కలిసి మహబూబాబాద్ జిల్లా అన్నారం దర్గా వద్దకు వెళ్ళి వస్తూ మండలంలోని మామిడాల సమీపంలో బుధవారం రాత్రి ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన శ్రవణ్కుమార్ను 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. బైక్ వెనుక కూర్చున్న స్నేహి తుడు మల్లే్షకు కూడా గాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ డానియల్కుమార్ తెలిపారు. శ్రవణ్కుమార్ అన్న మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం
చివ్వెంల, జనవరి 20: ఉద్యో గాలు, రుణాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి మోసం చేసిన కొంగాల ప్రసాద్రావు అలియాస్ పాస్టర్ జాన్ను పోలీసులు అరె స్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ లోకేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారిగూడెం గ్రామానికి చెందిన కొంగల ప్రసాద్రావు కొన్నేళ్ల క్రితం చివ్వెంల మండల పరిఽధిలోని కుడకుడలో నివసిస్తున్నాడు. సేవా కార్యక్రమాల పేరుతో ప్రజలను నమ్మించి ఉద్యోగాలు, ప్రభుత్వ రుణాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశాడు. గత సంవత్సరం డిసెంబరులో భార్యా పిల్లలతో కుడకుడలోని ఇంటి నుంచి పరారయ్యాడు. ప్రసాద్రావును అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ఉద్యోగాలు, రుణాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పేవారిని ప్రజలు నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు.
గుప్త నిధుల కోసం తవ్వకాలు
నేరేడుచర్ల, జనవరి 20: నేరేడుచర్ల మండలంలోని అత్యంత పురాతనమైన సోమప్ప దేవాలయంలో గుప్తనిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు గోపురంపై తవ్వకాలు జరిపారు. గతంలో కూడా ఆలయ శిఖరంపై, ధ్వజస్తంభం వద్ద తవ్వకాలు జరిపారు. మంగళవారం రాత్రి ఆలయ పైభాగంలో తవ్వకాలు జరపడంతో గోపురం ధ్వంసమైంది. బుధవారం ఉదయం ఆలయ పూజారి మేనేజర్ మృత్యుంజయశాస్త్రికి సమాచారం అందించడంతో స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాదవేంద్రరెడ్డి తెలిపారు.