ఆమె నా Wife.. కాదు నా భర్త ఉన్నాడు.. ‘అమ్మా.. రా’ అని కాళ్లు చుట్టుకున్న బాలిక.. రచ్చకెక్కిన పంచాయితీ!

ABN , First Publish Date - 2022-01-04T13:45:11+05:30 IST

భర్తలుగా చెప్పుకుంటున్న ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళ వివాదం మరోసారి రచ్చకెక్కింది...

ఆమె నా Wife.. కాదు నా భర్త ఉన్నాడు.. ‘అమ్మా.. రా’ అని కాళ్లు చుట్టుకున్న బాలిక.. రచ్చకెక్కిన పంచాయితీ!

హైదరాబాద్ సిటీ/పంజాగుట్ట : భర్తలుగా చెప్పుకుంటున్న ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళ వివాదం మరోసారి రచ్చకెక్కింది. ఇద్దరు భర్తలు అంటూ సంజీవరెడ్డినగర్‌ పోలీసులు తనను కించపరిచేలా వ్యవహరించారని ఆ వివాహిత ఆరోపించించింది. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన దుర్గా సత్యాదేవి, భర్త అని చెబుతున్న సత్యవరప్రసాద్‌తో కలిసి మాట్లాడుతుండగా ‘‘అమ్మా.. రా అమ్మా ..’’ అంటూ ఓ బాలిక ఏడుస్తూ ఆమె కాళ్లకు చుట్టుకుంది. ఆమె కొడుకునంటూ 17 సంవత్సరాల బాలుడు తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫొటోలను ప్రదర్శించాడు. కానీ ఆమె కనికరం చూపలేదు.


ఈ సందర్భంగా దుర్గాసత్యాదేవి మాట్లాడుతూ.. మొదటి భర్తను అంటూ ఫిర్యాదు చేసిన వ్యక్తి తన భర్త కాదని, తన సోదరి(అక్క) భర్త అని, ఆమె చనిపోవడంతో పిల్లలను చేరదీసి పెంచానని, వారు తనను తల్లిగా భావిస్తున్నారని పేర్కొంది. తన భార్య అని చెప్పుకుంటున్న శశికాంత్‌శర్మ తాను తప్పుడు కేసులో జైలుకెళ్లినప్పుడు ఎక్కడికి వెళ్లాడని, తాను వివాహం చేసుకుంటున్నప్పుడు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించింది.


సత్యవరప్రసాద్‌ మాట్లాడుతూ.. దుర్గా సత్యాదేవి పేరున 15 ఎకరాల భూమి ఉండడంతో దానిని తీసుకోవడానికే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. హన్మకొండకు చెందిన శశికాంత్‌శర్మ మాట్లాడుతూ.. 1999లో తమకు వివాహం అయిందని, కుమారుడు, కుమార్తె ఉన్నారన్నారు. తనతో ఇన్ని సంవత్సరాలు కాపురం చేసి ఇప్పుడు పిల్లలను వదిలి ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన వ్యక్తితో వెళ్లాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఆమె తల్లిదండ్రులు వచ్చి సత్యాదేవి తమ రెండో కుమార్తె అని, శశికాంత్‌శర్మతోనే వివాహం జరిపించామని, వారికి కుమార్తె, కొడుకు ఉన్నారని తెలిపారు. మాకు ఎలాంటి భూములూ లేవన్నారు.

Updated Date - 2022-01-04T13:45:11+05:30 IST