అద‌ృష్టమంటే వీళ్లదే.. రాత్రికి రాత్రే కోటీశ్వరులైన ఇద్దరు భారతీయులు!

ABN , First Publish Date - 2021-08-11T21:04:52+05:30 IST

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. దుబాయ్‌లో ఇద్దరు భారతీయులకు లాటరీ రూపంలో అదృష్టం వరించడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు.

అద‌ృష్టమంటే వీళ్లదే.. రాత్రికి రాత్రే కోటీశ్వరులైన ఇద్దరు భారతీయులు!

దుబాయ్: అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. దుబాయ్‌లో ఇద్దరు భారతీయులకు లాటరీ రూపంలో అదృష్టం వరించడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. దుబాయ్ మహజూజ్ వీక్లీ డ్రాలో ఇద్దరు భారతీయులు జాక్‌పాట్ కొట్టారు. దీంతో చెరో 1 మిలియన్ దిర్హమ్స్(రూ.2కోట్ల 2లక్షలు) గెలుచుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన దీప(50) తన ఫ్యామిలీతో కలిసి గత 18 ఏళ్లుగా యూఏఈలో నివాసముంటున్నారు. అక్కడి మార్కెట్ రిసెర్చ్ సంస్థలో పనిచేస్తున్నారు. ఇక యూఏఈలో దిగిన మొదటి రోజు నుంచి ఆమె క్రమం తప్పకుండా మహజూజ్ వీక్లీ లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్నారు. 


కానీ, ఈ 18 ఏళ్లలో ఎప్పుడూ ఆమెకు లాటరీ తగిలింది లేదు. అయినా నిరాశ చెందకుండా ప్రతి వారం లాటరీ టికెట్ కొనడం చేసేవారు. ఈ క్రమంలో ఇటీవల కొనుగోలు చేసిన లాటరీ టికెట్ ఆమెకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. దాంతో దీప ఏకంగా రెండు కోట్లు గెలుచుకున్నారు. ఈ భారీ నగదులో కొంత మొత్తం స్వదేశంలో ఉన్న తన తల్లిదండ్రుల ఆస్పత్రి ఖర్చులకు వినియోగిస్తానని ఆమె అన్నారు. అలాగే మరికొంత సొమ్మును తన పిల్లల చదువుకు ఖర్చు చేస్తానన్నారు. ఇప్పటికీ తాను ఇంత భారీ మొత్తం గెలిచానంటే నమ్మలేకపోతున్నానని ఈ సందర్భంగా దీప ఆనందం వ్యక్తం చేశారు. 


అలాగే ఇదే లాటరీలో జాక్‌పాట్ కొట్టిన మరో భారత వ్యక్తి పాండిచ్చేరికి చెందిన బరనిధరన్. గత పదేళ్లుగా యూఏఈలో ఉంటున్నారు. మహజూజ్ లాటరీ లాంచ్ చేసిన మొదటి రోజు నుంచి ఆయన ఇందులో పాల్గొంటున్నారు. తాజాగా 37వ వీక్లీ మహజూజ్ లాటరీలో బరనిధరన్‌కు జాక్‌పాట్ తగిలింది. ఆగస్టు 7న తీసిన డ్రాలో ఆయన 1 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నారు. తన లక్కీ నెం.07 అని, అదే నెంబర్‌తో కూడిన లాటరీ తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టడం నిజంగా ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇలా ఇద్దరు భారతీయులు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు.   


Updated Date - 2021-08-11T21:04:52+05:30 IST