‘ఏలేరు’లో ఇద్దరు మహిళలు గల్లంతు

ABN , First Publish Date - 2021-06-25T07:04:54+05:30 IST

ఏలేశ్వరం మండల పరిధిలోని యర్రవరంలో గురువారం ఏలేరు కాలువలో మునిగి ఇద్ద రు మహిళలు గల్లంతయ్యారు.

‘ఏలేరు’లో ఇద్దరు మహిళలు గల్లంతు
యర్రవరంలో ఏలేరు కాలువ వద్ద వివరాలు నమోదు చేస్తున్న పోలీసులు

ఒకరి మృతి, మరొకరి మృతదేహం కోసం గాలింపు
ఏలేశ్వరం, జూన్‌ 24: ఏలేశ్వరం మండల పరిధిలోని యర్రవరంలో గురువారం ఏలేరు కాలువలో మునిగి ఇద్ద రు మహిళలు గల్లంతయ్యారు. వారిలో ఒకరు మృతి చెం దగా మరొక మహిళ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించి ఏలేశ్వరం ఎస్‌ఐ విద్యాసాగర్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దాపురం రాజీవ్‌కాలనీకి చెందిన కోటిపల్లి సూర్యకుమారి (40), దేవీపట్నం మండలం ఎం.రావిలంక గ్రామానికి చెందిన కొండల వీరయ్యమ్మ(35) యర్రవరం, సోమవరం గ్రామాలకు వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చారు. గురువారం ఉదయం ఇద్దరు మహిళలు ఆలయాలకు సమీపంలోని ఏలేరు ప్రాజెక్టు నుంచి ఆయకట్టు భూములకు సాగునీరు సరఫరా చేసే ప్రధాన కాలువలోకి స్నానాలకు దిగారు. ప్రమాదవశాత్తూ కాలువ వెంబడి గోతుల్లో పడి నీటిలో మునిగిపోయారు. స్థానికుల సమాచారంతో ఎస్‌ఐ విద్యాసాగర్‌ సంఘటనా స్థలానికి చేరుకుని ఈతగాళ్ల సహాయంతో మహిళల జాడకోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో సూర్యకుమారి మృతదేహాన్ని గుర్తించి వెలికితీయగా, మరొక మహిళ ఆచూకీ లభ్యం కాలేదు. కాలువ వెంబడి లోతు ఎక్కువగా ఉండడంతో గాలింపునకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు గాలింపు చర్యలు కొనసాగించారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు గ్రామంలోని దేవాలయాల దర్శనాల కోసం లేదా ఉపాధి నిమిత్తం కూలీ పనుల కోసం వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన సూర్యకుమారికి తాపీ పనిచేస్తున్న ఇద్దరు కుమారులు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.


Updated Date - 2021-06-25T07:04:54+05:30 IST