బిస్కెట్లు తిని ఇద్దరు చిన్నారులు మృతి
ABN , First Publish Date - 2020-09-15T10:11:40+05:30 IST
బిస్కెట్లు తిని ఇద్దరు చిన్నారులు మృతి
ఆళ్లగడ్డ, సెప్టెంబరు 14: కిరాణా దుకాణంలో బిస్కెట్ పాకెట్ కొని తిన్న ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలుజిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నె గ్రామంలో సోమవారం ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన హుసేన్ బాషా దంపతులు ఆదివారం పొలంపనికి వెళ్లారు. వారి కుమారుడు హుసేన్ బాషా(6), కూతురు హుసేన్బీ(4)లతోపాటు చిన్న హుసేన్ బాషా కూతురు జమాల్బీ సాయంత్రం సమీపంలోని దుకాణాల్లో బిస్కెట్లు కొనుక్కొని తిన్నారు. ఆ వెంటనే ముగ్గురూ అస్వస్థతకు గురయ్యారు. పొలం నుంచి వచ్చిన తల్లిదండ్రులు వారిని ఆళ్లగడ్డలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. హుసేన్బాషా మృతి చెందాడు. మిగిలిన ఇద్దరినీ కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ హుసేన్బీ మృతి చెందింది. జమాల్బీ చికిత్స పొందుతోంది. బిస్కెట్ల శాంపిళ్లను ఫుడ్ సేఫిటీ అధికారులు పరిశీలిస్తున్నారని, వారిచ్చే నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామని ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు తెలిపారు.