కశ్మీర్‌లో మరో ఇద్దరి కాల్చివేత

ABN , First Publish Date - 2021-10-18T07:05:21+05:30 IST

కశ్మీర్‌లో రక్తపాతం కొనసాగుతోంది. స్థానికేతరులపై ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారు. ఇప్పటికే తొమ్మిది మంది స్థానికేతరుల్ని కాల్చి చంపిన ఉగ్రవాదులు.. ...

కశ్మీర్‌లో మరో ఇద్దరి కాల్చివేత

మొత్తం 11కు చేరిన మృతులు 

ప్రతి రక్తపు చుక్కకూ బదులిస్తాం: ఎల్జీ సిన్హా


శ్రీనగర్‌, అక్టోబరు 17: కశ్మీర్‌లో రక్తపాతం కొనసాగుతోంది. స్థానికేతరులపై ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారు. ఇప్పటికే తొమ్మిది మంది స్థానికేతరుల్ని కాల్చి చంపిన ఉగ్రవాదులు.. ఆదివారం మరో ఇద్దర్ని హత్య చేశారు. కుల్గామ్‌లో జరిగిన ఈ ఘటనలో మరో వ్యక్తి గాయపడారు. బాధితుల ఇంట్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు.. వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మొత్తం ముగ్గురికి తూటా గాయాలవగా.. ఇద్దరు మృతిచెందారు. దీంతో.. గడచిన రెండు వారాల్లో ముష్కర దాడుల్లో మృతిచెందిన వారి సంఖ్య 11కి చేరింది. కాగా, ఈ వరుస ఘటనలపై జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా తీవ్రంగా స్పందించారు. ఉగ్రమూకల దుశ్చర్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నేలరాలిన అమాయక పౌరులు, జవాన్ల ప్రతి రక్తపు చుక్కకూ బదులిస్తామని, ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతినబూనారు. ఉగ్రవాదుల వేట కొనసాగుతోందని, వారి సానుభూతిపరులనూ అంతం చేస్తామని తెలిపారు. కశ్మీర్‌లో జరుగుతున్న హింసతో స్థానికులకు సంబంధం లేదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా అన్నారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగుందని, కశ్మీరీలను దోషులుగా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. కాగా.. రాజౌరీ, పూంచ్‌ జిల్లాల్లోని అడవుల్లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల గాలింపు చర్యల్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో.. ఓ తల్లీ బిడ్డా సహా ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. గతంలో తాము ఐసిస్‌ బారినుంచి కాపాడి.. టర్కీ నుంచి భారత్‌కు తీసుకొచ్చిన ఓ యువకుడు.. ఇక్కడ అదే ఉగ్రసంస్థకు స్లీపర్‌ సెల్‌లా పనిచేస్తున్నాడని, స్థానిక యువతను ఉగ్రవాదం వైపు మళ్లించే దిశగా పనిచేస్తున్నాడని అధికారుల చెప్పారు. అతడ్ని అదుపులోకి తీసుకున్నామన్నారు.

Updated Date - 2021-10-18T07:05:21+05:30 IST