వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2022-01-19T06:27:11+05:30 IST
నర్సీపట్నం ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. వీటికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
శారదానగర్లో పంది అడ్డురావడంతో అదుపు తప్పిన బైక్
కొత్త బయపురెడ్డిపాలేనికి చెందిన యువకుడు దుర్మరణం
నెల్లిమెట్ట వద్ద బైక్ ఢీకొనడంతో వ్యక్తి మృతి
నర్సీపట్నం/ నర్సీపట్నం అర్బన్, జనవరి 18: నర్సీపట్నం ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. వీటికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. మునిసిపాలిటీ పరిధిలోని కొత్త బయపురెడ్డిపాలేనికి చెందిన భీమవరపు చక్రధర్సాయికుమార్ (23) సోమవారం రాత్రి స్నేహితుడు ఫణీంద్రతో కలిసి బైక్ మీద నర్సీపట్నం వచ్చాడు. ఇక్కడ టిఫిన్ చేసిన అనంతరం ఇంటికి వెళుతుండగా శారదానగర్ వినాయకుడి గుడి వద్ద ఆకస్మికంగా పంది అడ్డు వచ్చింది. దీంతో బైక్ని అదపు చేసేక్రమంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో సాయి అక్కడిక్కడే మృతి చెందగా ఫణీంద్రకు స్వల్పగాయాలయ్యాయి. సాయి మహారాష్ట్రలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ సంక్రాంతి పండక్కి స్వగ్రామం వచ్చాడు. పట్టణ ఎస్ఐ నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ ఢీకొని వ్యక్తి మృతి
రోలుగుంట మండలం బుచ్చెంపేట గ్రామానికి చెందిన మాకిరెడ్డి రాము (35) సోమవారం రాత్రి డీజిల్ కోసం ఆటోలో బంకు వద్దకు బయలుదేరాడు. నెల్లిమెట్ట వద్ద ఆటో దిగి పెట్రోల్ బంకు వైపు నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా ఏటిగైరంపేట వైపు నుంచి వస్తున్న బైక్ బలంగా ఢీకొంది. దీంతో రాము తలకు బలమైన గాయాలు కావడంతో ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్య సేవలు పొందుతూ మృతిచెందాడు. రాము భార్య మాకిరెడ్డి మంగ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సోమలింగేశ్వరరావు తెలిపారు. కాగా, బైక్ నడుపుతున్న రాయపురెడ్డి మణికంఠకు స్వల్పగాయాలు అయ్యాయి. రౌతులపూడి మండలం మల్లంపేటకు చెందిన ఇతను సంక్రాంతి సందర్భంగా ఏటిగైరంపేటలో బంధువులు ఇంటికి వచ్చాడు. సోమవారం రాత్రి తిరిగి సొంతూరు వెళుతుండగా ప్రమాదం జరిగింది.