వ్యాక్సిన్‌ వాహనం ఎస్కార్ట్‌గా వెళ్లి.. ఇద్దరు పోలీసుల దుర్మరణం

ABN , First Publish Date - 2021-05-15T09:32:55+05:30 IST

తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట ఏడీబీ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు పోలీసులు దుర్మరణం పాలయ్యారు. విజయవాడ నుంచి..

వ్యాక్సిన్‌ వాహనం ఎస్కార్ట్‌గా వెళ్లి.. ఇద్దరు పోలీసుల దుర్మరణం

  • రోడ్డుపై ఎదురు చూస్తున్నవారిని ఢీకొట్టిన టిప్పరు

సామర్లకోట, మే 14: తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట ఏడీబీ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు పోలీసులు దుర్మరణం పాలయ్యారు. విజయవాడ నుంచి కాకినాడ వస్తున్న వ్యాక్సిన్‌ వాహనానికి ఎస్కార్ట్‌ నిమిత్తం తిమ్మాపురం హైవే పెట్రోలింగ్‌ సిబ్బందిని నియమించారు. హెడ్‌ కానిస్టేబుల్‌ మొండి సత్యనారాయణ (50), హోంగార్డు ఎన్‌ఎ్‌స రెడ్డి(42) వ్యాక్సిన్‌ వాహనం కోసం ఉండూరు జంక్షన్‌ వద్ద రోడ్డుపై ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో పెద్దాపురం వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న టిప్పర్‌ వారిని అతి వేగంగా ఢీకొంది. లారీ కిందపడి ఇరువురూ అక్కడికక్కడే మృతి చెందారు. కాకినాడ డీఎస్పీ భీమారావు, రూరల్‌ సీఐ ఆకుల మురళీకృష్ణ, సామర్లకోట ఎస్‌ఐ వీఎల్వీకే సుమంత్‌, తిమ్మాపురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహలను తరలించారు. తిమ్మాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-05-15T09:32:55+05:30 IST