నేవీ అమ్ములపొదిలోకి రెండు యుద్ధనౌకలు

ABN , First Publish Date - 2022-05-18T07:56:57+05:30 IST

దేశీయంగా తయారైన సూరత్‌, ఉదయగిరి అనే రెండు యుద్ధనౌకలు మంగళవారం భారత నేవీ అమ్ములపొదిలోకి చేరాయి.

నేవీ అమ్ములపొదిలోకి రెండు యుద్ధనౌకలు

దేశీయంగా తయారైన సూరత్‌, ఉదయ్‌గిరి నౌకల్ని లాంచ్‌ చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌


ముంబై, మే 17: దేశీయంగా తయారైన సూరత్‌, ఉదయగిరి అనే రెండు యుద్ధనౌకలు మంగళవారం భారత నేవీ అమ్ములపొదిలోకి చేరాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వీటిని ముంబైలోని మజగాన్‌ డాక్స్‌ వద్ద లాంచ్‌ చేశారు. ‘‘మున్ముందు దేశీయ అవసరాలకే కాక, అంతర్జాతీయ అవసరాలకూ భారత్‌లో నౌకల నిర్మాణం జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యాధునిక క్షిపణి క్యారియర్లలో ఈ రెండు నౌకలు కూడా ఉంటాయి. నేటి రక్షణావసరాలే కాక, భవిష్యత్‌ అవసరాలకూ ఇవి ఉపయోగపడతాయి. నేవీ ఆత్మనిర్భరతలో విక్రాంత్‌ నౌక నిర్మాణం ఒక కీలక మైలురాయి. ఇండో-పసిఫిక్‌లో భారత్‌ పాత్ర చాలా కీలకం. అందువలన ఈ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచడం భారత నేవీ ప్రధాన లక్ష్యం’’ అని రాజ్‌నాథ్‌ అన్నారు. కాగా.. ఈ నౌకల తయారీకి అయిన మొత్తం ఖర్చులో 75 శాతం తిరిగి భారత ఆర్థిక వ్యవస్థలోకే చేరిందని నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఎస్‌ హరి కుమార్‌ పేర్కొన్నారు. ఇక.. దేశీయంగా తయారైన రెండు యుద్ధనౌకలు ఒకేసారి లాంచ్‌ కావడం ఇదే తొలిసారి అని మజగాన్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌(ఎండీఎల్‌) సంస్థ తెలిపింది. రెండు నౌకలకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ నేవల్‌ డిజైన్‌(డీఎన్‌డీ) రూపకల్పన చేయగా, ముంబైలోని రక్షణ రంగ సంస్థ ఎండీఎల్‌లో ఇవి తయారయ్యాయి. తర్వాతి దశలో భాగంగా ఈ నౌకలకు వివిధ అదనపు హంగులను జత చేర్చనున్నారు.

Updated Date - 2022-05-18T07:56:57+05:30 IST