ద్విచక్ర వాహన దొంగలు దొరికారు
ABN , First Publish Date - 2021-08-04T06:27:04+05:30 IST
ద్విచక్ర వాహనాలను దొంగలించిన 11 మందిని అరెస్టు చేశారు.
11 మంది అరెస్టు, రూ.కోటి విలువైన 107 వాహనాల స్వాధీనం
చిత్తూరు, ఆగస్టు 3: జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాహనదారుల కళ్లుకప్పి ద్విచక్ర వాహనాలను దొంగలించిన 11 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.కోటి విలువైన 107 ద్విచక్ర వాహనాలతోపాటు ఓ ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను మంగళవారం ఎస్పీ సెంథిల్కుమార్ పాత పోలీస్ మైదానంలో మీడియాకు తెలిపారు. వివిధ పోలీస్స్టేషన్లలో నమోదైన ద్విచక్రవాహనాల చోరీల నిందితులను గుర్తించడానికి నాలుగు సబ్ డివిజన్ల పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వారం రోజులుగా నిఘా పెట్టి నిందితులను గుర్తించారు. వాహనాలను చోరీ చేశాక మన రాష్ట్రంతోపాటు కర్ణాటక, తమిళనాడుల్లో అమ్మేస్తున్న 11 మందిని అరెస్టు చేశారు. వీరిలో.. యాదమరి మండలం దాసరాపల్లెకు చెందిన వినోద్కుమార్, కీనాటంపల్లెకు చెందిన సీజీ రాజు, అత్తిగారిపల్లెకు చెందిన ఎస్.జ్యోతి, చిత్తూరు ప్రశాంత్నగర్కు చెందిన రవిచంద్ర, తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా కట్టూరుకు చెందిన సతీష్కుమార్, రెడ్హిల్స్కు చెందిన ఎల్.జయచంద్ర, వేలూరు జిల్లా పేర్నంబట్ తాలూకా ముదినేపల్లెకు చెందిన మురళి, మాసిగానికి చెందిన కుమరేషన్, వరదయ్యపాళ్యం మండలం కరిపాకానికి చెందిన ఎస్.వెంకటేశ్వర్లు, కె.సుబ్రహ్మణ్యం, సత్యవేడు మండలం ఎన్ఆర్ కండ్రిగకు చెందిన యుగంధర్ ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ.కోటి విలువైన 107 ద్విచక్ర వాహనాలు, ఓ ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు డివిజన్ పరిధిలో.. 35, పుత్తూరులో.. 37, పలమనేరులో.. 28, శ్రీసిటీ పరిధిలో 8 వాహనాలున్నాయి. వాహన దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సిబ్బంది ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ డీఎన్ మహేష్, చిత్తూరు, పలమనేరు డీఎస్పీలు సుధాకర్రెడ్డి, గంగయ్య, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.