ముగిసిన త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు
ABN , First Publish Date - 2022-01-27T06:27:22+05:30 IST
రాజన్న ఆలయంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు బుధవారం ముగిశాయి.
వేములవాడ టౌన్, జనవరి 26 : రాజన్న ఆలయంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి మాట్లాడారు. ‘త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల్లో పాల్గొనడం రాజరాజేశ్వరస్వామి కృప’ అని అన్నారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా ఉత్సవాలను అంతరంగికంగా నిర్వహించినట్లు చెప్పారు. వచ్చే సంవత్సరం ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. అనంతరం కళాకారులను సన్మానించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శన
ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున నిర్వహించిన కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బుధవారంసాయంత్రం 4 గంటలకు లక్ష్మీనారాయణ భాగవతార్ శ్రీశైల మహత్యం హరికథ, రాత్రి 7గంటలకు కొండపల్లి నటరాజ్ శాస్ర్తీయ తబలా తరంగిణి, వేములవాడ పట్టణ ప్రముఖులైన భాషా సాస్కృతిక శాఖ సహాయసంచాలకులు ఆనంద రఘునందన్ సంగీత కార్యక్రమం భక్తులను అలరించాయి. ఏఈవోలు, మధు రాధాకిషన్, త్యాగరాజ ఉత్సవాల ఇన్చార్జి కొంటికర్ల రామయ్యశర్మ, మధుశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.