మళ్లీ వాయు‘గండం’

ABN , First Publish Date - 2020-12-01T09:00:11+05:30 IST

మళ్లీ వాయు‘గండం’

మళ్లీ వాయు‘గండం’

మరింత బలపడి తుఫానుగా మారే చాన్స్‌.. బురేవిగా నామకరణం


అమరావతి, విశాఖపట్నం, న్యూఢిల్లీ, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): అతి తీవ్ర తుఫాను నివర్‌ సృష్టించిన జల విలయం నుంచి రైతులు ఇంకా కోలుకోనేలేదు. ఈ పరిస్థితుల్లో మరో తుఫాను దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని తీవ్ర అల్పపీడనం బలపడి సోమవారం ఉదయం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి, ట్రింకోమలై(శ్రీలంక)కి తూర్పు ఆగ్నేయంగా 710 కిలోమీటర్లు, కన్యాకుమారి(తమిళనాడు)కి ఆగ్నేయంగా 1,120 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత బలపడి 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా, తర్వాత 24గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. దీనికి మాల్దీవులు సూచించిన ‘బురేవి’ అనే పేరు పెట్టారు. ఇది పశ్చిమవాయవ్య దిశగా ప్రయాణించి బుధవారం సాయంత్రం/రాత్రి శ్రీలంక తీరాన్ని దాటే అవకాశం ఉంది. తదుపరి గురువారం ఉదయానికి కొమెరిన్‌ ప్రాంతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది.


దీని ప్రభావంతో మంగళవారం దక్షిణ కోస్తాలో తేలికపాటి వర్షాలు, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, బుధవారం చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాను ప్రభావంతో మంగళ, బుధవారాల్లో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, దక్షిణ కర్ణాటక, లక్షద్వీప్‌ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తుఫాను తీరాన్ని దాటే సమయంలో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు సూచించారు. కాగా, సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 200 బోట్లను కోస్టుగార్డు సాయంతో ఒడ్డుకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని తమిళనాడు మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్‌ చెప్పారు.

Updated Date - 2020-12-01T09:00:11+05:30 IST