అఫ్ఘాన్ మాజీ అధ్యక్షుడికి ఆశ్రయమిచ్చిన యూఏఈ!
ABN , First Publish Date - 2021-08-19T02:14:38+05:30 IST
అప్ఘానిస్థాన్ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీని తమ దేశంలోకి అనుమతించినట్టు యూఏఈ తాజాగా ధ్రువీకరించింది.
దోహా: అప్ఘానిస్థాన్ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీని తమ దేశంలోకి అనుమతించినట్టు యూఏఈ తాజాగా ధ్రువీకరించింది. మానవతా దృక్పథంతో మాజీ అధ్యక్షుడు, ఆయన కుంటుంబానికి ఆశ్రయమిచ్చామని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. అయితే..ఘనీ ప్రస్తుతం ఏ నగరంలో ఉన్నారనేది మాత్రం వెల్లడించలేదు. ఆదివారం నాడు.. రాజధాని కాబూల్లో తాలిబన్లు కాలు పెట్టకముందే ఘనీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇక అఫ్ఘానిస్థాన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న తాలిబన్లు..మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్తో చర్చలు జరుపుతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో అఫ్ఘానిస్థాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.