రెసిడెన్సీ వీసాపై యూఏఈ కీలక నిర్ణయం !
ABN , First Publish Date - 2020-04-01T17:58:40+05:30 IST
రోనావైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో యూఏఈ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
యూఏఈ: కరోనావైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో యూఏఈ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. గడువు ముగిసిన రెసిడెన్సీ వీసాదారులకు తీపి కబురు అందించింది. రెసిడెన్సీ వీసాల గడువును మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రజల నుంచి ఎలాంటి అదనపు రుసుము తీసుకోకుండా ఏప్రిల్ 1 నుంచి వారు తమ నివాస వీసాలను పొడిగించుకోవడానికి అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో గడువు ముగిసిన ఎమిరేట్స్ ఐడీలపై కూడా ఎలాంటి పెనాల్టీ విధించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు యూఏఈ కెబినేట్ ఆమోదం తెలిపింది.
యూఏఈలో కరోనావైరస్ వ్యాప్తి నుండి వచ్చే ప్రభావాలను నివారించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రివర్గం తెలియజేసింది. అలాగే అన్ని పరిపాలనా జరిమానాలకు కూడా సడలింపు ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. తాజాగా ఆమోదం పొందిన ఈ నిర్ణయాలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయని మంత్రివర్గం స్పష్టం చేసింది. ఇక ఇప్పటికే యూఏఈ సర్కార్ కొవిడ్-19 వ్యాప్తి, నియంత్రణకు దేశ వ్యాప్తంగా ప్రజల మధ్య సామాజిక దూరం, స్వీయ నిర్బంధాన్ని అమలు చేయడంతో పాటు ప్రయాణాలపై ఆంక్షలు, విమాన సర్వీసుల రద్దు తదితర చర్యలు తీసుకుంది. కాగా, యూఏఈలో ఇప్పటివరకు 664 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆరుగురు మరణించారు.