యూఏఈ ఆరోగ్యశాఖ అధికారులకు కొవిడ్ వ్యాక్సిన్ డోసులు..
ABN , First Publish Date - 2020-09-22T17:14:36+05:30 IST
యూఏఈలో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి సర్కార్ వీలైనంత త్వరగా వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
అబుధాబి: యూఏఈలో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి సర్కార్ వీలైనంత త్వరగా వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్లో ఉన్న వ్యాక్సిన్ను యూఏఈకి చెందిన ఆరోగ్యశాఖ అధికారులు మొదట తీసుకుంటున్నారు. శనివారం ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి అబ్దుల్ రహ్మాన్ బిన్ మొహమ్మద్ అల్ ఓవైస్ వ్యాక్సిన్ తొలి డోస్ను తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం మరో ముగ్గురు ఆరోగ్యశాఖ అధికారులు ఈ వ్యాక్సిన్ డోసులను తీసుకోవడం జరిగింది. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన హెల్త్ సెంటర్స్, క్లినిక్స్ సెక్టార్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ డాక్టర్ హుస్సేన్ అల్ రాండ్, సహాయ సేవల సెక్టార్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ అవద్ అల్ కెట్బీ, ఎమిరేట్స్ కార్పొరేషన్ ఫర్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్, హాస్పిటల్ సెక్టార్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ డాక్టర్ యూసఫ్ అల్ సెర్కల్ ఉన్నారు.
కాగా, వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే మొదట తమ ప్రాణాలను పణంగా పెట్టి కొవిడ్ బాధితులకు సేవలు చేస్తున్న ఫ్రంట్లైన్ హెల్త్ వర్కర్స్కు అందిస్తామని యూఏఈ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ట్రయల్స్ దశలో ఉన్న వ్యాక్సిన్ను ఆరోగ్యశాఖ అధికారులు మొదట తీసుకోవడం జరుగుతోంది. ఎలాంటి దుష్ప్రభావాలు లేకపోతే వ్యాక్సిన్ను ఫ్రంట్లైన్ హెల్త్ వర్కర్స్కు ఇవ్వనున్నారు.