కోలుకుంటున్న యూఏఈ.. 5 మిలియన్లు దాటిన కోవిడ్ టెస్టులు
ABN , First Publish Date - 2020-08-04T16:23:03+05:30 IST
మహమ్మారి కరోనా వైరస్ నుంచి యూఏఈ క్రమంగా కోలుకుంటోంది. అంతకంతకు రివకరీలు పెరగడంతో పాటు పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి.
యూఏఈ: మహమ్మారి కరోనా వైరస్ నుంచి యూఏఈ క్రమంగా కోలుకుంటోంది. అంతకంతకు రివకరీలు పెరగడంతో పాటు పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. రికవరీ రేటు కూడా 90 శాతానికి చేరిందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అదే సమయంలో మరణాలు కూడా తగ్గుముఖం పట్టడం శుభపరిణామం అని ఆ దేశ ఆరోగ్యశాఖ పేర్కొంది. గత రెండు రోజులుగా దేశంలో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. గత నెలలో కూడా మూడు రోజులు ఇలాగే మరణాలు నమోదు కాలేదు. మరోవైపు ఈ వైరస్ వ్యాప్తి కట్టడికి యూఏఈ ముమ్మరంగా కోవిడ్ టెస్టులు నిర్వహిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 5.2 మిలియన్ల కరోనా పరీక్షలు పూర్తి చేసింది. ఆగస్టు నెలాఖరు వరకు ఆరు మిలియన్ల కోవిడ్ టెస్టులు పూర్తి చేయాలని నిర్దేశించుకుంది.
ఇక సోమవారం దేశంలో 164 కొత్త కేసులు నమోదైతే... 248 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 61,163కు చేరితే... మొత్తం రికవరీలు 54,863 అయ్యాయి. కాగా, దేశవ్యాప్తంగా మొత్తం 351 మందిని ఈ మహమ్మారి బలిగొందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 5,949 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇదిలా ఉంటే... దేశంలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో 'ఈద్ అల్ అధా' పండుగ తర్వాత నుంచి మసీదుల్లో ప్రార్థనల కోసం 50 శాతం మందిని అనుమతించాలని యూఏఈ సర్కార్ నిర్ణయించింది. వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా జూలై 1 నుంచి దేశంలోని మసీదుల్లో కేవలం 30 శాతం మందిని మాత్రం అనుమతిస్తున్న విషయం తెలిసిందే. అందుకే తాజాగా 50 శాతం మందిని అనుమతించాలనే నిర్ణయం తీసుకున్నారు.