ఆవు పాలు త‌క్కువ ఇస్తున్న‌ద‌ని ఒంటె గొంతు కోశాడు!

ABN , First Publish Date - 2021-06-10T14:19:46+05:30 IST

రాజ‌స్థాన్‌లోని ప్ర‌ముఖ పర్యాటక ప్రదేశం...

ఆవు పాలు త‌క్కువ ఇస్తున్న‌ద‌ని ఒంటె గొంతు కోశాడు!

ఉదయపూర్: రాజ‌స్థాన్‌లోని ప్ర‌ముఖ పర్యాటక ప్రదేశం ఉదయపూర్‌లో మూఢ‌న‌మ్మ‌కాల‌తో కూడిన బాగోతం వెలుగు చూసింది. రాష్ట్ర జంతువుగా  గుర్తింపు పొందిన ఒంటె  కొంద‌రి మూర్ఖ‌త్వానికి బ‌ల‌య్యింది. సూరజ్‌పోల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఒక‌ ఒంటె... త‌ల న‌రికి వేసి, కేవ‌లం మొండెం మాత్ర‌మే క‌నిపించిన ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. దీనిని తీవ్రంగా ప‌రిగ‌ణించిన పోలీసులు ద‌ర్యాప్తు చేసి, ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. మూఢ‌న‌మ్మ‌కాల వ‌ల‌లో ప‌డిన నిందితులు మంత్ర విద్య‌ల‌ను న‌మ్మి, ఒక ఒంటె మెడను తెగ‌నరికార‌ని సూరజ్‌పోల్ పోలీస్ అధికారి డాక్టర్ హనుమంత్ సింగ్‌రాజ్ పురోహిత్ మీడియాకు తెలిపారు. 


నిందితులు ఒంటె మెడను తెగ‌న‌రికి, దానిని వారి ఇంటి వెలుపల పాతిపెట్టారు. ఈ కేసులో నిందితుడు రాజేష్ అహిర్, శోభాలాల్, చేతన్, రఘువీర్‌సింగ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. గోవర్ధన్ విలాస్ ప్రాంతంలో రాజేష్ అహిర్ డెయిరీ నడుపుతున్నాడు. అతనికి రెండు డజన్లకు పైగా ఆవులు ఉన్నాయి. అయితే డెయిరీలోని ఒక ఆవు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉండ‌టంతో పాలు త‌క్కువ‌గా ఇస్తోంది. ఈ నేప‌ధ్యంలో రాజేష్ స్థానికంగా ఉంటున్న‌ చేతన్ అనే యువ‌కుడిని ఆశ్ర‌యించాడు. అత‌ను త‌న తండ్రి శోభాలాల్‌ను చేత‌న్‌కు పరిచయం చేశాడు. శోభాలాల్ మంత్ర తంత్రాలు చేస్తుంటాడు. అత‌ను రాజేష్‌తో... ఒంటె త‌ల న‌రికి దానిని ఇంటి వెలుప‌ల పాతిపెడితే స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతుంద‌ని చెప్పాడు. దీంతో శోభాలాల్ చెప్పిన విధంగా రాజేష్ తన స్నేహితుల స‌హాయంతో ఒంటె మెడను న‌రికి, దానిని త‌న ఇంటిముందు పాతిపెట్టాడు. అయితే ఇటీవల ఒక ఒంటె మొండెం పోలీసులకు ల‌భ్యంకావ‌డంతో పోలీసులు దీనిపై దృష్టి సారించి, ద‌ర్య‌ప్తు చేశారు.ఈ సమయంలో ఒక వ్య‌క్తి నుంచి అందిన సమాచారంతో పాటు, రాజేష్ ఇంటి చుట్టుపక్కల ల‌భించిన ఆధారాల‌తో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

Updated Date - 2021-06-10T14:19:46+05:30 IST