వైభవంగా ఉగాది

ABN , First Publish Date - 2021-04-14T04:58:22+05:30 IST

జిల్లాలో ప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. ఉదయం తమ ఇష్టదైవాలకు పూజలు చేసి ఉగాది పచ్చడి సేవించారు.

వైభవంగా ఉగాది
నెల్లూరు : మూలాపేట శివాలయంలో జరుగుతున్న పూజలు

ఊరూరా సంబరాలు

ఆలయాల్లో ఉత్సవాలు

పంచాంగ శ్రవణం


నెల్లూరు(సాంస్కృతికం), ఏప్రిల్‌ 13 : జిల్లాలో ప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. ఉదయం తమ ఇష్టదైవాలకు పూజలు చేసి ఉగాది పచ్చడి సేవించారు. ఆలయాల్లో ఉత్సవాలు, ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిగాయి. ముఖ్యంగా గ్రామ దేవతల ఆలయాలను విశేషంగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు బారులుతీరి దైవ దర్శనం చేసుకున్నారు. నెల్లూరులోని రంగనాఽథస్వామి, రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాలతోపాటు జిల్లాలోని పెంచలకోన క్షేత్రం, నర్రవాడ, బిట్రగుంట, గొలగమూడి వెంకయ్యస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. 

నెల్లూరు గ్రామదేవత ఇరుకళల పరమేశ్వరికి ప్రత్యేక అలంకరణ పూజలు జరిగాయి. రాత్రి అమ్మవారి నగరోత్సవం వైభవంగా సాగింది. వీరభద్రస్వామికి నంది వాహన సేవ జరిగింది. మూలస్థానేశ్వరాలయంలో భువనేశ్వరి అమ్మవారి ఆలయాన్ని పండ్లు, కూరగా యలు, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. టీటీడీ కల్యాణ మండపంలో శ్రీవారి కల్యాణోత్సవం, నవాబుపేట ఉడయవర్లు దేవస్థానంలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణం వైభవంగా జరిగాయి. రంగనాథస్వామి ఆలయంలో శ్రీరామ హనుమాన్‌ భక్తబృందం ప్రసాద వితరణ చేసింది. సాయంత్రం అన్ని ఆలయాల్లో పంచాంగ శ్రవణం జరిగింది. సామాన్యులతోపాటు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు ప్లవనామ సంవత్సరంలో తమ రాశి ఫలాలను తెలుసుకునేందుకు ఆసక్తిని ప్రదర్శించారు. బాలాజీనగర్‌ ఉగాది సెంటర్‌లో పంచాంగ పూజ జరిగింది. హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతీ మహాస్వామి ఉగాది ఆశీస్సులు అందజేశారు. కాగా, అధికారికంగా జరగాల్సిన పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని కరోనా ఉధృతి కారణంగా కలెక్టర్‌ రద్దు చేశారు. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో వేదపండితులు పరాంకుశం అనంత పద్మనాభాచార్యులు, గుడ్లూరు ఫణిశర్మ, కిడాంభి జగన్నాథాచార్యులుకు కలెక్టర్‌ బంగ్లాలో పురస్కారాలు అందజేశారు. సహాయ కమిషనర్‌ పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.



Updated Date - 2021-04-14T04:58:22+05:30 IST