బ్రిటన్ మంత్రివర్గంలో కరోనా కలకలం.. ఐసోలేషన్లో ప్రధాని
ABN , First Publish Date - 2021-07-18T23:08:08+05:30 IST
కరోనా రెండు డోసులు తీసుకున్న తరువాత కూడా బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ కరోనా బారిన పడటంతో బ్రిటన్ మంత్రివర్గంలో కలకలం రేగుతోంది.
లండన్: కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తరువాత కూడా బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ కరోనా బారిన పడటంతో బ్రిటన్ మంత్రివర్గంలో కలకలం రేగుతోంది. ఈ క్రమంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదివారం ఐసోలేషన్ విధించుకున్నారు. ఆర్థిక శాఖ మంత్రి రిషి సునక్కూ కూడా ఐసోలేషన్లో ఉన్నారు. ఇక బ్రిటన్ చట్టాల ప్రకారం.. కరోనా బారిన పడ్డ వారిని కలిసిన వ్యక్తులు పది రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాల్సి ఉంటుంది. అంతకమునుపు.. బ్రిటన్ ప్రధాని, ఆర్థిక మంత్రితో కరోనా వ్యాప్తికి సంబంధించి ఓ పైలట్ ప్రాజెక్టును చేపడుతున్నట్టు బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రధాని విధుల్లో లేనప్పుడు ఐసోలేషన్లో ఉంటారని, మిగతా సమయంలో తన కార్యాలయంలో అత్యవసర విధుల్లో మాత్రమే పాల్గొంటారని తెలిపింది. అంతేకాకుండా.. ప్రధానికి ప్రతిరోజూ కరోనా టెస్టులు చేస్తామని కూడా పేర్కొంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. సామాన్యులకు ఓ నిబంధన, ప్రముఖులకు మరొకటా అంటూ విమర్శలు చెలరేగడంతో ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. ప్రధాని కూడా ఐసోలేషన్లో ఉంటారంటూ కొద్ది గంటల తరువాత పీఎం కార్యాలయం మరో ప్రకటన విడుదల చేసింది.