తమిళనాడులో అపహరణకు గురైన విగ్రహాలను.. భారత్‌కు అప్పగించిన యూకే

ABN , First Publish Date - 2020-09-16T15:42:27+05:30 IST

తమిళనాడు ఆలయం నుండి దొంగిలించబడిన మూడు విగ్రహాలను బ్రిటన్ తిరిగి భారతదేశానికి పంపించింది.

తమిళనాడులో అపహరణకు గురైన విగ్రహాలను.. భారత్‌కు అప్పగించిన యూకే

లండన్: తమిళనాడు ఆలయం నుండి దొంగిలించబడిన మూడు విగ్రహాలను బ్రిటన్ తిరిగి భారతదేశానికి పంపించింది. దశాబ్దాల క్రితం తమిళనాడులోని ఒక ఆలయం నుండి దొంగిలించబడిన రాముడు, సీత, లక్ష్మణుల మూడు విగ్రహాలను మంగళవారం భారత ప్రభుత్వానికి అప్పగించింది. ఈ విగ్రహాల చోరీ 1978లో జరిగింది. కాగా, లండన్‌లోని మెట్రోపాలిటన్ పోలీస్ సహచరులతో కలిసి పనిచేస్తున్న తమిళనాడు పోలీసుల ఐడల్ వింగ్ దర్యాప్తు వల్ల విగ్రహాల గుట్టు తెలిసింది. ఈ విగ్రహాల చరిత్ర, రుజువులను తమిళనాడులోని ఓ కలెక్టర్ లండన్‌లోని మెట్రోపాలిటన్ పోలీసులకు పంపించారు. దీంతో తమ వద్ద ఉన్న విగ్రహాల నమూనాలను పోలీసులు పోల్చి చూశారు. దాంతో ఆ నమూనాలు వాటికి సరిపోయాయి. 


అయితే, ఈ విగ్రహాలు విజయనగర కాలానికి చెందినవని, తమిళనాడులోని నాగపట్నం జిల్లాలోని అనంతమంగళంలోని శ్రీ రాజగోపాలస్వామి ఆలయం నుండి దొంగిలించబడినవని నిరూపించబడింది. ఇక కొవిడ్-19 పరిమితుల కారణంగా సమావేశాల పరిమితిని అనుసరించి లండన్‌లోని ఇండియా హౌస్ నుండి ప్రసారం చేసిన కార్యక్రమంలో లండన్‌లోని శ్రీ మురుగన్ ఆలయానికి చెందిన పూజారులు భారతదేశానికి అప్పగించడం కోసం ఒక చిన్న మతపరమైన వేడుకను నిర్వహించారు. 


"ఈ రోజు ఈ అందమైన పవిత్ర విగ్రహాల శోధన, రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తైంది. వీటిని కొన్ని సంవత్సరాలుగా ఎంతో పవిత్రంగా పూజించారు. ఈ దేవతలను తిరిగి భారతదేశానికి పంపించే ముందు ఓ ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించాలని మేము కోరుకుంటున్నాము”అని యూకేలోని భారత హైకమిషనర్ గైత్రి ఇస్సార్ కుమార్ అన్నారు.


కాగా, సంస్కృతి మరియు పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ మాట్లాడుతూ విగ్రహాలను స్వదేశానికి రప్పించడాన్ని స్వాగతించారు. 2014 నుంచి 40 దొంగిలించబడిన అమూల్యమైన కళాఖండాలు భారతదేశానికి వచ్చి చేరాయని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. 


Updated Date - 2020-09-16T15:42:27+05:30 IST