సుశీల్ కేసులో.. ఉక్రెయిన్ మహిళ కీలకం
ABN , First Publish Date - 2021-06-16T06:38:47+05:30 IST
రెజ్లర్ సాగర్ హత్య కేసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం జైల్లో ఉన్న ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్, సాగర్ మధ్య శత్రుత్వానికి ఉక్రెయిన్కు చెందిన మహిళతో ...
న్యూఢిల్లీ: రెజ్లర్ సాగర్ హత్య కేసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం జైల్లో ఉన్న ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్, సాగర్ మధ్య శత్రుత్వానికి ఉక్రెయిన్కు చెందిన మహిళతో వ్యవహారమే ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి కేసు మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతోంది. ఆమెను ప్రశ్నిస్తే కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆమె కోసం ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు. మోడల్ టౌన్లోని సుశీల్ అద్దెకు ఇచ్చిన ఫ్లాట్కు ఆమె తరచూ వచ్చేదని సమాచారం. సాగర్ సహచరులు అమిత్, గ్యాంగ్స్టర్ కాలా జహేది మేనల్లుడు సోనూ మహల్కు ఆమె పరిచయస్తురాలని తెలుస్తోంది. అయితే, సుశీల్ ప్రధాన అనుచరుడు అజయ్ కుమార్ కూడా ఆ ఉక్రెయిన్ మహిళపై కన్నేశాడట. ఉక్రెయిన్ మహిళ బర్త్ డే పార్టీలో ఆమెతో అజయ్ సెల్ఫీ తీసుకోవడం మొత్తం గొడవకు ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సాగర్ను తన ఫ్లాట్ ఖాళీ చేయమని సుశీల్ చెప్పడంతో వారి మధ్య విభేదాలు పొడసూపాయి. దీంతో గత నెల 4న సాగర్, సోనూలను కిడ్నాప్ చేసి ఛత్రసాల్కు తీసుకువచ్చి తీవ్రంగా హింసించాడు. గాయాలు కావడంతో సాగర్ మరణించాడు.