మహిళా కానిస్టేబుల్కు స్టేషన్లోనే మంగళ స్నానాలు... కారణమిదే!
ABN , First Publish Date - 2021-04-24T13:38:53+05:30 IST
రాజస్థాన్లో కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది.
జైపూర్: రాజస్థాన్లో కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఇదే సమయంలో పెళ్లి కూతురైన ఒక మహిళా కానిస్టేబుల్కు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే మంగళ స్నానాలు జరిగాయి. ఇప్పుడు ఈ ఉదంతం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే డూంగర్పూర్ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ ఆశకు వివాహం జరగబోతోంది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మినీలాక్ డౌన్లు అమలవుతున్న సందర్భంగా పోలీసులకు సెలవులు దొరకడం కష్టమైపోయింది. ఈ నేపధ్యంలో ఆశకు మంగళస్నానాల తంతు రోజున సెలవు దొరకలేదు. దీంతో ఆమెకు తోటి మహిళా కానిస్టేబుళ్లు స్టేషన్ ఆవరణలోనే మంగళ స్నానం చేయించారు. ఈ సందర్భంగా ఆశ మాట్లాడుతూ తనకు గత ఏడాదే వివాహం జరగాల్సిందని, అయితే కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడిందన్నారు. ఇప్పుడు ఏప్రిల్ 30న వివాహం జరగనున్నదన్నారు. అయితే లాక్డౌన్ కారణంగా వివాహానికి తగినన్ని రోజుల పాటు సెలవులు దొరకలేదని తెలిపారు. దీంతో డ్యూటీలో ఉంటూనే మంగళ స్నానం తంతు చేసుకోవాల్సి వచ్చిందన్నారు.