మారని మెనూ!
ABN , First Publish Date - 2021-04-17T05:56:14+05:30 IST
మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా అక్షయపాత్ర ఏజెన్సీ పాఠశా లలకు సరఫరా చేస్తున్న కిచిడీని విద్యార్థులు తినలేకపోతున్నారు.
కిచిడీని తినలేకపోతున్న విద్యార్థులు
బయటపారబోస్తున్న వైనం
ఆమదాలవలస : మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా అక్షయపాత్ర ఏజెన్సీ పాఠశా లలకు సరఫరా చేస్తున్న కిచిడీని విద్యార్థులు తినలేకపోతున్నారు. సోమవారం నుంచి శనివారం వరకూ రోజుకో మెనూ అమలవుతుంది. అన్ని రోజులూ భోజనం బాగుంటున్నా గురువారం పూట అందిస్తున్న కిచిడీని విద్యార్థులు తినలేక బయటపడేస్తున్నారు. దీనిపై గత ఫిబ్రవరిలో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావడంతో స్పీకర్ సతీమణి, తొగరాం సర్పంచ్ తమ్మినేని వాణిశ్రీ స్పందించారు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఆమె నాసిరకంగా ఉండడంతో అక్షయపాత్ర అధికారులను మందలించారు. ఈ వ్యవహారం సీఎం దృష్టి వరకూ వెళ్లింది. అయినా కిచిడీ మాత్రం బాగుండడం లేదు. దీంతో విద్యార్థులు గురువారం నాడు ఇంటి నుంచి కేరియర్లు పట్టుకెళ్తున్నారు. మిగతా రోజుల్లా పప్పన్నం పెడితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. లక్ష్మీనగర్ పాఠశాలను గురువారం ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలించగా విద్యార్థులు కిచిడీని తినలేక డస్టుబిన్లో పడేయడం కనిపించింది. ఈ విషయంపై ఎంఈవో చంద్రశేఖర్ వద్ద ప్రస్తావించగా.. మెనూ మార్చమని చెప్పామని, మరోసారి పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.