కుదరని సయోధ్య

ABN , First Publish Date - 2021-11-27T06:00:36+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజీ కుదరకపోవడంతో పోలింగ్‌ అనివార్యమైంది. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు శుక్రవారం సైతం స్వతంత్ర అభ్యర్థులు వెనక్కి తగ్గకుండా బరిలో నిలవడంతో ఓటింగ్‌ నిర్వహించనున్నారు.

కుదరని సయోధ్య
నల్లగొండలో మద్దతుదారులతో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోటిరెడ్డి

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో ఏడుగురు

టీఆర్‌ఎ్‌స అభ్యర్థితో పాటు మరో ఆరుగురు స్వతంత్రులు

ఫలించని మంత్రి జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్సీ గుత్తా ప్రయత్నాలు

స్వతంత్రుల వెనుక రేవంత్‌, కోమటిరెడ్డి?

టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులతో నేడు రాజధానిలో మంత్రి సమావేశం



(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ):  స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజీ కుదరకపోవడంతో పోలింగ్‌ అనివార్యమైంది. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు శుక్రవారం సైతం స్వతంత్ర అభ్యర్థులు వెనక్కి తగ్గకుండా బరిలో నిలవడంతో ఓటింగ్‌ నిర్వహించనున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి, మరో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. స్వతంత్రులంతా కాంగ్రె్‌సకు చెందిన వారే.


ఎమ్మెల్సీ బరి నుంచి స్వతంత్రుల్లో చాలా మంది నామినేషన్లను ఉపసంహరించుకుంటారని రాజకీయవర్గాలు భావించాయి. స్వతంత్ర అభ్యర్థులను ఉపసంహరింపజేయాలని మంత్రి జగదీ్‌షరెడ్డితో పాటు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రావుతో పాటు పలువురు ప్రయత్నాలు చేసినా వారు వెనక్కి తగ్గలేదు. మొత్తం 11 మంది నామినేషన్లు వేయగా అందులో మూడు ప లు కారణాలతో తిరస్కారానికి గురయ్యాయి. మిగిలిన ఎనిమిది మంది లో ఒకరు నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో ఏడుగురు బరిలో నిలిచారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి మొత్తం 1241 ఓట్లు ఉండగా, అందులో 1000 ఓట్లకు పైగా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందినవి ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థితోపాటు ఆరుగురు స్వతంత్రులు బరిలో ఉండటంతో పోలింగ్‌ అనివార్యమైంది. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలుచేసిన కాంగ్రెస్‌ జడ్పీటీసీ కుడుదుల నగేష్‌ వెనుక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉన్నట్లు చర్చ సాగుతోంది. మరో స్వతంత్ర అభ్యర్థి నల్లగొండ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, భువనగిరి పార్లమెంట్‌ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ప్రధాన అనుచరుడు. స్వతంత్రులను పోటీనుంచి విరమింపజేసేందుకు నల్లగొండ మంత్రితో పాటు పలువురు ముఖ్యులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెండు రోజుల పాటు మకాం వేసి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.


వచ్చేనెల మొదటి వారంలో టీఆర్‌ఎస్‌ క్యాంప్‌

స్థానిక సంస్థల ఎన్నికను ఎదుర్కోక తప్పని పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ డిసెంబరు మొదటి వారంలో హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు క్యాంపు నిర్వహించేందుకు నిర్ణయించుకుంది. ఓటరుకు కనీసం రూ.1లక్ష వరకు అందజేయాలని ఆ పార్టీ నిర్ణయించినట్టు సమాచా రం. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి జగదీ్‌షరెడ్డి హైదరాబాద్‌లోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఈ నెల 27న ఉదయం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. రెండు రోజుల పాటు క్యాంపు రాజకీయాలు ఉండనుండటంతో పాటు విప్‌ కూడా జారీ చేయనున్నారు. దీనికి తోడు మాక్‌ పోలింగ్‌ను నిర్వహించి ఓటర్లకు అవగాహన కల్పించనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి కోటిరెడ్డి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్ర మే ఉండటంతో నిధులు ఎలా సమకూర్చాలనే దానిపై కూడా సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. ఖర్చును పార్టీనే భరించే అవకాశాలు ఉన్నట్లు చర్చ సాగుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించి మంత్రి జగదీ్‌షరెడ్డితో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఇతర నేతలు నియోజకవర్గ బాధ్యతలు తీసుకోనున్నట్టు తెలిసింది.


 క్రాస్‌ ఓటింగ్‌ ఉండేనా?

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని ఇరుకునపెట్టే ప్రయత్నాల్లో భాగంగానే కాంగ్రెస్‌ పెద్దలు వారి అనుచరులను రంగంలోకి దించినట్టు అంతా భావిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి 200 ఓట్లు ఉండగా, మరో 200 ఓట్లు టీఆర్‌ఎస్‌ నుంచి క్రాస్‌ అవుతాయని అంచనా వేస్తున్నారు. స్థానిక సంస్థలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలేదని, విధులు కూడా కల్పించలేదని, ఎమ్మెల్యేలు సైతం తమను లెక్కచేయడం లేదని పలువురు ఎంపీటీసీలు ఆగ్రహంతో ఉన్నారు. అధికార పార్టీ జడ్పీటీసీలు, ఎంపీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. వీటన్నింటి దృష్ట్యా అధికార పార్టీకి చెందిన ఓట్లు తమకు లాభిస్తాయని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది. వారిలో అసంతృప్తి లేకుండా చేసి ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో క్రాస్‌కాకుండా చూడాలని అధికార పార్టీ సవాల్‌గా తీసుకుంది. ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో ఉండటం తమకు లాభించే అంశమేనని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఒకే పార్టీకి చెందిన వారే స్వతంత్రులుగా ఉంటే, పోటీలో ఉన్న అభ్యర్థులు ఖర్చు పెట్టే అవకాశం ఉండదని, ఇది కలిసొస్తుందని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు.


 స్వతంత్రులకు రేవంత్‌, కోమటిరెడ్డి మద్దతు?

జిల్లాపై పట్టు సాధించేందుకు తెర వెనుక రేవంత్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు తొలుత దూరంగా ఉండాలని భావించి నా, రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో రంగంలోకి దిగి ఆలేరు జడ్పీటీసీ, మాజీ ఎమ్మెల్యే నగే్‌షను నిలబెట్టారు. అధికార పార్టీకి తన మార్పును చూపించే ప్రయత్నాల్లో రేవంత్‌ ఉన్నట్లు భావిస్తున్నారు. భువనగిరి పార్లమెంట్‌ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రధాన అనుచరుడు నల్లగొండ జడ్పీటీ సీ వంగూరి లక్ష్మయ్యను బరిలోకి దించారు. వీరితో పాటు మిగతా స్వ తంత్రులంతా కాంగ్రె్‌సకు చెందిన వారే. నగేష్‌, లక్ష్మయ్య రాజీపడే పరిస్థితి కనిపించడం లేదు. నగేష్‌, లక్ష్మయ్య కదలికలపై అధికా ర పార్టీ కన్నేసి ఉంచింది. నగేష్‌, రేవంత్‌రెడ్డి ఇలాఖా మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అమర్‌చింతలో మకాం వేసినట్లు సమాచారం. అదేవిధంగా ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు చెందిన కొంత మంది కాంగ్రెస్‌ నేతలతో ఆయన అమర్‌చింత నుంచి శ్రీశైలం వెళ్లినట్టు తెలిసింది.


విపక్ష అభ్యర్థుల మధ్య కుదరని రాజీ

నామినేషన్ల ఉపసంహరణ కు ముందు వరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మినహా ఏడుగురు స్వతంత్రులు బరిలో ఉన్నారు. మంత్రి జగదీ్‌షరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వీరేశం ఓ స్వతంత్ర అభ్యర్థితో గురువారం నామినేషన్‌ ఉపసంహరించుకునేలా చేశారు. మిగతా అభ్యర్థులంతా ప్రత్యేకంగా సమావేశమైనా పోటీ విషయంలో సయోధ్య కుదరలేదు. మిగతా వారంతా నామినేషన్‌ ఉపసంహరించుకొని, ఎవరో ఒకరు పోటీలో ఉండాలని కోరినా రాజీ కుదరలేదు. తామంటే తాము పోటీలో ఉంటామని చెప్పడంతో చివరికి ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు రంగంలో నిలిచారు.


 10న పోలింగ్‌

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మొత్తం ఏడుగురు అభ్యర్థులు రంగం లో ఉండటంతో పోలింగ్‌కు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఎంసీ కోటిరెడ్డి పోటీలో ఉండగా స్వతంత్ర అభ్యర్థులుగా కసర్ల వెంకటేశ్వర్లు, రాంసింగ్‌, బెజ్జం సైదులు, ఎ.శ్రీశైలం, కుడుదుల నగేష్‌, వంగూరి లక్ష్మయ్య ఉన్నారు. డిసెంబరు 10వ తేదీన పోలింగ్‌, 14వతేదీన కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. అందు కు ఎన్నికల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పోలింగ్‌ వెంటనే ఆయా కేంద్రాల నుంచి బ్యాలెట్‌బాక్సులను స్ట్రాంగ్‌రూంకు తరలిస్తారు. 14వ తేదీన నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో కౌంటింగ్‌ నిర్వహిస్తారు.



నిధులు, విధుల్లేవ్‌

అలంకారప్రాయంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు

అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్రులుగా బరిలోకి

స్థానిక సంస్థల నిర్వీర్యంపై ప్రచారానికి యత్నం

యాదాద్రి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా గెలిచి రెండున్నరేళ్లయింది. 2019 మే నెలలో ఎన్నికలు జరగ్గా, లక్షలు ఖర్చుచేసి గెలిచారు. అయితే ఇప్పటి వరకు స్థానిక సంస్థలకు ప్రభుత్వం ఎలాంటి నిధులు విడుదల చేయలేదు.  ఆర్థిక సంఘం నిధులు అంతంతే. అంతేగాక ప్రజాప్రతినిధులకు విధుల కేటాయింపు కూడా లేదు. ప్రొటోకాల్‌ సమస్య సరేసరి. నిధులు లేకపోవడతో ఏ పనులు చేయలేక ప్రజల్లో తిరగలేకపోతున్నారు. అటు గ్రామాలకు వెళ్లలేక. ఇటు కార్యాలయానికి వెళ్లలేక కేవలం సర్వసభ్య సమావేశాలకు హాజరవుతూ ఉత్సవ విగ్రహాలుగా మిగిలామని ఎంపీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ హక్కులను కాలరాస్తోందని పలుచోట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తమ నిరసన తెలిపేందుకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీలు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. పోటీ నుంచి నామినేషన్లను ఉపసంహరించుకోవాలని అధికార పార్టీకి చెందిన పెద్దలు ప్రయత్నించినా విరమించుకునేందుకు ససేమేరా అన్నట్టు తెలిసింది. అధికార పార్టీకి స్థానికంగా అందుబాటులో లేకుండా సుదూర ప్రాంతాలకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో తమతో కలిసొచ్చే ప్రజాప్రతినిధులను కలుపుకొని జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కుడుదుల నగే్‌షను స్వత్రంత్ర అభ్యర్థిగా దీటుగా ప్రచారాన్ని చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని, ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవ చిహ్నంగా, ప్రశ్నించే గొంతుకను గెలిపించాలనే నినాదంతో ఆయన ముందుకుసాగాలని నిర్ణయించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్ని ఓట్లు వస్తాయన్నది కాకుండా, ప్రతిపక్షాల తరపున ప్రభుత్వానికి నిరసన తెలపాన్నదే ప్రధాన అజెండాగా తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయనకు కాంగ్రెస్‌ పార్టీ చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మునిసిపల్‌ కౌన్సిలర్లతో పాటు బీజేపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కూడా మద్దతు తెలుపుతున్నట్టు సమాచారం.


మోత్కూరు ఎంపీపీ రాజీనామా

నిధులు, విధులు కల్పించనందుకు నిరసనగా

మోత్కూరు: స్థానిక సంస్థలకు నిధులు, విధులు కేటాయించనందుకు నిరసనగా మోత్కూరు ఎంపీపీ, బీజేపీకి చెందిన దీటి సంధ్యారాణి శుక్రవారం రాజీనామా చేశారు. జడ్పీ సీఈవో అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, ఎంపీపీగా బాధ్యతలు చేపట్టి రెండున్నరేళ్లు అవుతున్నా ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని, విధులు కూడా లేవన్నారు. దీంతో అధికారులు ప్రోటోకాల్‌ కూడా పాటించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని, తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రజలు న్యాయం చేయలేకపోతున్నాననే బాధతో రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని అన్నారు. కాగా, బీజేపీకి చెందిన దీటి సంధ్యారాణి, భర్త సందీప్‌ 2019లో ఎంపీటీసీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పొడిచేడు ఎంపీటీసీ స్థానం నుంచి సంధ్యారాణి గెలుపొందారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ చెరిసమానం ఎంపీటీసీ స్థానాలు గెలుచుకోవడంతో లాటరీ నిర్వహించగా, ఎంపీపీగా దీటి సంధ్యారా ణి గెలిచారు. భర్తతో కలిసి ఏడాది క్రితం బీజేపీలో తిరిగి చేరారు.

Updated Date - 2021-11-27T06:00:36+05:30 IST