బీటీపీఎస్ నిర్వాసిత నిరుద్యోగి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-01-08T04:28:36+05:30 IST
బీటీపీఎస్ నిర్వాసిత నిరుద్యోగి ఆత్మహత్య
ఉద్యోగం రాదేమోనన్న మనోవేదనతో యువకుడి అఘాయిత్యం
కొలువు కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగి విసిగిపోయి తనువు చాలించిన వైనం
పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుడి తండ్రి
మణుగూరు, జవనరి 7 : భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణం కోసం సాగు భూమిచ్చిన ఓ యజమాని కుమారుడు.. ఒప్పందం ప్రకారం వచ్చే ఉద్యోగం కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగాడు. కానీ కొలువు రాకపోవడంతో విసుగుచెందిన ఆ బీటెక్ పూర్తిచేసిన నిరుద్యోగ యువకుడు చివరకు తనువు చాలించాడు. ఈ సంఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయిగూడెంలో జరిగింది. సాంబాయిగూడెం పేరంటాల చెరువు సమీపంలో రూపిరెడ్డి వెంకటరెడ్డి అనే రైతుకు 853-52 పట్టాలో 1.20ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అది బీటీపీఎస్కు అవసరం కావడంతో.. ఆ భూమి కింద సీలింగ్ యాక్ట్ ప్రకారం రూ.5లక్షల నష్టపరిహారంతో పాటు కుటుంబంలోని నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తారని తెలపడంతో ఆ భూమిని అధికారులకు అప్పగించారు. ఆ సమయంలో అధికారులు ఉద్యోగాలకు సంబంధించిన తొలి జాబితాలో వెంకటరెడ్డి కుమారుడైన బీటెక్ పూర్తిచేసిన రూపిరెడ్డి సతీష్ (24) పేరును నమోదు చేశారు. ఆతర్వాత నాన్లోకల్, రెండు నెలలు తక్కువ వయసు, పసుపు కుంకుమల భూములు అనే కారణాలు ఆ జాబితా నుంచి కొందరి పేర్లను అధికారులు తొలగించారు. ఈ క్రమంలో నిరుద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఆతర్వాత పలు సార్లు సమావేశమైన ఆర్ఆర్ఆర్ కమిటీ కొన్ని సడలింపులతో ఉద్యోగాలు ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేసింది. దీంతో నిరుద్యోగ యువతలో మళ్లీ ఆశలు చిగురించాయి. ఇటీవల సుమారు 345 మందిని కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకుంటారని తెలియడంతో జాబితా నుంచి నాడు తొలగింపునకు గురైన వారిలో మళ్లీ ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే తొలగింపు జాబితాలో ఉన్న సతీష్రెడ్డి.. కమిటీ తీసుకున్న నిర్ణయాలు, నిబంధనల మేరకు అన్ని అర్హతలు ఉన్న తనకు ఉద్యోగం ఇప్పించాలంటూ రెండేళ్ల క్రితం సబ్ కలెక్టర్కు విన్నవించుకున్నాడు. దీంతో సతీష్రెడ్డి లాంటి కేసులపై తగిన విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వాలని నాడు సబ్కలెక్టర్ రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, కానీ రెవెన్యూ అధికారులు మాత్రం తమకున్న పనిఒత్తిడి కారణంగా నివేదిక అందించడంలో జాప్యం చేశారని తెలుస్తోంది. ఈ ప్రక్రియ సాగుతున్న సవ ుయంలో సతీష్ తన ఉద్యోగం కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. కానీ రెవెన్యూ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోతుండటం, ఉద్యోగాల కేటాయింపులో స్పష్టత ఇవ్వడంలో జాప్యం జరుగు తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన సతీష్రెడ్డి ఈనెల నాలుగో తెదీన కలుపుమందును తాగాడు. ప్రాణపాయస్థితిలోకి స్ధితిలోకి వెళ్లిన అతడిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ గురువారం కన్నుమూశాడు. మృతుడి తండ్రి వెంకటరెడ్డి ఫిర్యాదుతో మణుగూరు సీఐ బాను ప్రకాష్ కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఉద్యోగం కోసం తన కుమా రుడు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగాడని, అయినా కనికరం చూపలేదని, వారి తాత్సారం వల్లే తన ఇలా ప్రాణం తీసుకున్నాడని వెంకటరెడ్డి, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.