ఉద్యోగాల కోసం ఆందోళన
ABN , First Publish Date - 2021-06-22T07:08:37+05:30 IST
రాష్ట్రంలో ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీచేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిరుద్యోగులు రోడ్డెక్కారు.
రోడ్డెక్కిన నిరుద్యోగులు
ప్రభుత్వ తీరుపై తీవ్ర నిరసన
ఒంగోలు (కలెక్టరేట్), జూన్ 21 : రాష్ట్రంలో ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీచేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిరుద్యోగులు రోడ్డెక్కారు. ఒంగోలులోని కలెక్టరేట్ ఎదుట ఏపీ అన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అలాగే దర్శిలోనూ ఆందోళన నిర్వహించారు. ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో యూనియన్జిల్లా కన్వీనర్ జె.సంజీవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెల్లడించిన జాబ్ క్యాలెండర్లో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రకటించకపోవడం దారుణంగా ఉందన్నారు. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని ఆరోపించారు. గ్రూపు-1, గ్రూపు-2లో ఖాళీగా ఉన్న 2వేల పోస్టులతోపాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6,500 పోలీస్ ఉద్యోగాలను క్యాలెండర్లో ప్రకటించి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వంశీ, సుబ్బారావు, మణికంఠ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.