ఉపశమనం!

ABN , First Publish Date - 2021-12-06T04:41:31+05:30 IST

ఉపశమనం!

ఉపశమనం!
బిర్లంగి పంచాయతీ భవనం

- పంచాయతీలకు యూనియన్‌ బ్యాంక్‌ ఖాతాలు

- ఆర్థిక సంఘ నిధుల కోసం..

- పీఎఫ్‌ఎంఎస్‌ పర్యవేక్షణలో వినియోగం

ఇచ్ఛాపురం రూరల్‌, డిసెంబరు 5: ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించిందా? పంచాయతీలకు కేటాయించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుందా? మార్గదర్శకాలు ప్రకారం ఖర్చు చేయాలని ఆదేశాలిచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పంచాయతీలకు ప్రత్యేకంగా యూనియన్‌ బ్యాంక్‌ ఖాతాలు ఏర్పాటుచేసి..అందులో నిధులు జమ చేయనుంది. ఆర్థిక సంఘం నిధులను మార్గదర్శకాలకు విరుద్ధంగా వినియోగించకూడదనే నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను ఇతర ఖాతాలకు మళ్లించడంతో పంచాయతీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఖాతాలు ఖాళీగా దర్శనమిస్తుండగా పంచాయతీల నిర్వహణ కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ మద్దతుదారులైన సర్పంచ్‌లు సైతం రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గళమెత్తారు. సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించి పంచాయతీలకు ప్రత్యేకంగా యూనియన్‌ బ్యాంక్‌ ఖాతాలు తెరిపించాలని ఆదేశించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు  జిల్లాలోని 1,194 పంచాయతీలకు యూనియన్‌ బ్యాంక్‌ ఖాతాలు తెరిచే పనిలో పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. నిధుల వినియోగాన్ని పీఎఫ్‌ఎంఎస్‌ పర్యవేక్షణలో ఉండే ఇ-గ్రామస్వరాజ్‌, ప్రియ సాప్ట్‌వేర్‌ ద్వారానే నిర్వహించాలని ఉన్నతాధికారులు  స్పష్టం చేశారు. ఈ విషయమై డీఎల్‌పీవో హరిహరరావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా..పంచాయతీలకు ప్రత్యేక ఖాతాలు తెరవాలని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శులకు ఆదేశాలు జారీచేసినట్టు చెప్పారు. 

Updated Date - 2021-12-06T04:41:31+05:30 IST