జోరు పెంచిన ఎఫ్పీఐలు
ABN , First Publish Date - 2020-02-17T07:35:16+05:30 IST
కేంద్ర బడ్జెట్ తర్వాత విదేశీ సంస్థాగత మదుపరు(ఎఫ్పీఐలు)లు మళ్లీ భారత మార్కెట్లో పెట్టుబడుల జోరు పెంచాయి. ఈ నెల 3-14 మధ్యకాలంలో..
- ఫిబ్రవరిలో రూ.24,617 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ తర్వాత విదేశీ సంస్థాగత మదుపరు(ఎఫ్పీఐలు)లు మళ్లీ భారత మార్కెట్లో పెట్టుబడుల జోరు పెంచాయి. ఈ నెల 3-14 మధ్యకాలంలో ఈ సంస్థలు, భారత క్యాపిటల్ మార్కెట్లో రూ.24,617 కోట్ల నికర పెట్టుబడులు పెట్టాయి. ఇందులో రూ.14,191 కోట్లు రుణ పత్రాల మార్కెట్లో, రూ.10,426 కోట్లు ఈక్విటీ మార్కెట్లో మదుపు చేశాయి. బడ్జెట్లో కంపెనీలపై డివిడెండ్ పంపిణీ పన్ను (డీడీటీ) తొలగించడం ఈ సంస్థలను బాగా ఆకర్షించింది. ద్రవ్య, పరపతి విధానానికి సంబంధించి సర్దుబాటు వైఖరి అవలంబిస్తామన్న ఆర్బీఐ వైఖరితో రుణ పత్రాల మార్కెట్లోనూ జోరు పెంచాయి.
ఎంఎఫ్ల్లో తగ్గిన ఈక్విటీ పెట్టుబడులు
డిసెంబరు 2019తో ముగిసిన త్రైమాసికంలో ఈక్విటీ షేర్లలో మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) పెట్టుబడులు తగ్గాయి. ఈ కాలానికి ఎంఎ్ఫలు ఈక్విటీ మార్కెట్లో రూ.11,837 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశాయి. సెప్టెంబరు 2019తో ముగిసిన త్రైమాసికంలో నమోదైన రూ.23,874 కోట్లతో పోలిస్తే ఇది 50 శాతం తక్కువ. జీడీపీ వృద్ధి రేటు నీరసించడం, కంపెనీల షేర్ల విలువ అధికంగా ఉన్నాయనే భయాలు ఇందుకు ప్రధాన కారణం. అయితే డిసెంబరు, 2019తో ముగిసిన త్రైమాసికంలో ఎంఎ్ఫల ఈక్విటీ పెట్టుబడుల మొత్తం ఆరు శాతం పెరిగి రూ.7.7 లక్షల కోట్లకు చేరింది.