సాగు చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

ABN , First Publish Date - 2021-11-24T22:45:45+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినట్లుగా కొత్త సాగు చట్టాలను రద్దు

సాగు చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినట్లుగా కొత్త సాగు చట్టాలను రద్దు చేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మూడు చట్టాలను రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశం అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ, మూడు సాగు చట్టాల రద్దుకు కేబినెట్ అదికారికంగా ఆమోదం తెలిపిందని చెప్పారు. దీనికి సంబందించి ప్రధాని మోదీ ఈ నెల 19న ఓ ప్రకటన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నవంబరు 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. సమావేశాల తొలి రోజు నుంచే ఈ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. మోదీ ఇచ్చిన మాటను ఐదు రోజుల్లోనే నెరవేర్చారన్నారు. బుధవారం కేబినెట్ సమావేశం ఎజెండాలో ఈ అంశం లేదని చాలా మంది పాత్రికేయులు చెప్తున్నారని ఆరోపించారు.


ఈ చట్టాలను రద్దు చేయాలని దాదాపు 40 రైతు సంఘాలు ఓ సంవత్సరం నుంచి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 19న జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రైతులకు మేలు కలిగించే ఈ చట్టాలపై ప్రజలకు నచ్చజెప్పడంలో విఫలమయ్యామని చెప్తూ, ప్రజలను క్షమాపణ కోరారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కోసం నూతన నిబంధనావళిని రూపొందించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. 


Updated Date - 2021-11-24T22:45:45+05:30 IST