అన్నదాతలకు కేంద్రం శుభవార్త

ABN , First Publish Date - 2021-09-08T22:58:04+05:30 IST

రైతుల నుంచి సేకరించే రబీ పంటల ఉత్పత్తుల కనీస

అన్నదాతలకు కేంద్రం శుభవార్త

న్యూఢిల్లీ : రైతుల నుంచి సేకరించే రబీ పంటల ఉత్పత్తుల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)లను కేంద్ర ప్రభుత్వం పెంచింది.  గోధుమల ఎంఎస్‌పీని 100 కేజీలకు రూ.40 పెంచి, రూ.2,015గా నిర్ణయించింది. గోధుమల ఉత్పాదక వ్యయం క్వింటాలుకు రూ.1,008గా అంచనా వేసింది. అదే విధంగా ఆవాలు క్వింటాలుకు రూ.400 చొప్పున పెంచి, రూ.5,050గా నిర్ణయించింది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 


ఖరీఫ్, రబీ సీజన్లలో పండే 23 పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని ప్రకటిస్తుందన్న సంగతి తెలిసిందే. గోధుమలు, ఆవాలు ముఖ్యమైన రబీ పంటలు. సీసీఈఏ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆరు రబీ పంటలకు ఎంఎస్‌పీని పెంచినట్లు తెలిపింది. 2021-22 సాగు సంవత్సరం (జూలై-జూన్), 2022-23 మార్కెటింగ్ సంవత్సరం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 


2020-21 క్రాప్ ఇయర్‌లో క్వింటాలు గోధుమలకు ఎంఎస్‌పీ రూ.1,975 అని, దీనిని రూ.40 పెంచి, రూ.2,015గా నిర్ణయించినట్లు సీసీఈఏ తెలిపింది. బార్లీ ఎంఎస్‌పీని క్వింటాలుకు గత ఏడాది కన్నా రూ.35 పెంచుతూ, రూ.1,635గా నిర్ణయించినట్లు తెలిపింది. 


శనగపప్పు ఎంఎస్‌పీని క్వింటాలుకు రూ.5,230గా నిర్ణయించింది. ఇది అంతకు ముందు కన్నా రూ.130 ఎక్కువ. పెసలు, ఉలవలు వంటి పప్పుల ఎంఎస్‌పీని క్వింటాలుకు రూ.400 పెంచి, రూ.5,500గా నిర్ణయించింది. క్వింటాలు కుసుమలకు ఎంఎస్‌పీని రూ.114 పెంచి, రూ.5,327గా నిర్ణయించింది. 


రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర పొందాలనే లక్ష్యంతో 2022-23 రబీ మార్కెటింగ్ సీజన్‌లో రబీ పంటల ఎంఎస్‌పీని పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సగటు ఉత్పాదక వ్యయం కన్నా కనీసం 1.5 రెట్లు ఎక్కువ ఉండేవిధంగా ఎంఎస్‌పీని నిర్ణయిస్తామని 2018-19 కేంద్ర బడ్జెట్‌లో చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 


అధికారిక లెక్కల ప్రకారం 2021-22 రబీ మార్కెటింగ్ సీజన్‌లో ప్రభుత్వం రికార్డు స్థాయిలో 43 మిలియన్ టన్నుల గోధుమలను సేకరించింది. 


Updated Date - 2021-09-08T22:58:04+05:30 IST