‘మోదీ భారత్’ను ఏ దేశమూ కన్నెత్తి చూడలేదు: రవి శంకర్
ABN , First Publish Date - 2020-05-28T08:48:10+05:30 IST
సరిహద్దుల వద్ద పరిస్థితులు పూర్తిగా స్థిరంగా, నియంత్రణలోనే ఉన్నాయని చైనా ప్రకటించింది.
పరిస్థితి నియంత్రణలోనే ఉంది: చైనా
ఇది 62 కాదు.. 2020: వీకే సింగ్
న్యూఢిల్లీ, మే 27: సరిహద్దుల వద్ద పరిస్థితులు పూర్తిగా స్థిరంగా, నియంత్రణలోనే ఉన్నాయని చైనా ప్రకటించింది. ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ మీడియాకు చెప్పారు. సరిహద్దు వివాదాల్లో చైనా వైఖరి స్పష్టంగా, స్థిరంగా ఉందని చెప్పారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని మోదీ మధ్య గతంలో కుదిరిన ఏకాభిప్రాయాలను తాము అనుసరిస్తున్నామని తెలిపారు. చైనా, భారత్ మధ్య తలెత్తుతున్న విభేదాలపై ఇరు దేశాలు సరైన విధంగా స్పందించాలని, ధ్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడకుండా చూసుకోవాలని భారత్లోని చైనా రాయబారి సన్ వీడాంగ్ చెప్పారు.
కాగా, ప్రధాని మోదీ సారథ్యంలోని భారత్ను ఏ దేశమూ కన్నెత్తి చూడలేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం విలేకరుల సమావేశంలో అన్నారు. భారత్-చైనా వివాదంపై భారత రక్షణ రంగ నిపుణుడు నితిన్ గోఖలే స్పందించారు. ఉద్రిక్త పరిస్థితులు తగ్గే చర్యలు చైనా నుంచి ప్రారంభమయ్యాయని ట్వీట్ చేశారు. భారత్, చైనా మధ్య నెలకొన్న పరిస్థితులపై కేంద్రం వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు.