భర్త చేసిన అప్పులకు భార్యపై కత్తులతో దాడి
ABN , First Publish Date - 2021-04-13T16:14:44+05:30 IST
అర్థిక లావాదేవీలలో వివాదం కారణంగా ఓ మహిళను కొందరు వ్యక్తులు
హైదరాబాద్/సైదాబాద్ : అర్థిక లావాదేవీలలో వివాదం కారణంగా ఓ మహిళను కొందరు వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేసి పారిపోయారు. సైదాబాద్ లోకాయుక్తాకాలనీలోని నయాగ్రా అపార్ట్మెంట్ మూడో ఫ్లోర్లో నివాసముండే మంజుల, పరిమళ్ అగర్వాల్ దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. పరిమళ్ వ్యాపారాలలో నష్టం రావడంతో రూ.లక్షలు అప్పులు చేశాడు. సంవత్సర కాలంగా ఇంటికి రాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. మంజు ఓ ప్రైవేటు రియల్ ఎస్టేట్ కార్యాలయంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.
సోమవారం రాత్రి 9 గంటల సమయంలో సుమారు ఆరుగురు వ్యక్తులు మంజుల ఇంటికి వచ్చి డబ్బుల కోసం గొడవపడి అరిచారు. అపార్ట్మెంట్ కిందికి వెళ్లి మాట్లాడదామని ఆమెను కిందికు తీసుకెళ్లారు. ఆమెతో వాగ్వాదానికి దిగారు. కొద్ది సేపటి తర్వాత ఆమెపై కత్తితో దాడి చేసి పారిపోయారు. ఆమె అరుపులకు అపార్ట్మెంట్వాసులు ఘటనాస్థలికి చేరుకుని పోలీసులకు సమాచారమందించారు. 108 సిబ్బంది అక్కడకు చేరుకుని ఆమెను పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనా స్థలాన్ని అడిషనల్ సీపీ చౌహన్, తూర్పు మండల డీసీపీ రమేష్, మలక్పేట ఏసీపీ వెంకటరమణ సందర్శించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సందర్శించి వివరాలు సేకరించారు. తెలిసిన వ్యక్తులే హత్యకు పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.