అన్‌లాక్-1ను స్వేచ్ఛ అనుకోవద్దు : యోగి ఆదిత్యనాథ్

ABN , First Publish Date - 2020-06-06T23:53:23+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి నిరోధానికి ఉద్దేశించిన అష్ట దిగ్బంధనంలో అన్‌లాక్-1ను

అన్‌లాక్-1ను స్వేచ్ఛ అనుకోవద్దు : యోగి ఆదిత్యనాథ్

లక్నో : కోవిడ్-19 మహమ్మారి నిరోధానికి ఉద్దేశించిన అష్ట దిగ్బంధనంలో అన్‌లాక్-1ను స్వేఛ్ఛ అని అనుకోవద్దని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. కొన్ని ఆంక్షలు కొనసాగుతాయన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురి కన్నా ఎక్కువ మంది చేరకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భౌతిక దూరం నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. 


జూన్ 8 నుంచి దేశవ్యాప్తంగా అన్‌లాక్-1ను అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం మే 30న ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 25న విధించిన దేశవ్యాప్త అష్ట దిగ్బంధనం నుంచి ప్రజలకు సోమవారం కాస్త ఊరట లభించబోతోంది. దేవాలయాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు వంటివాటిని తెరవబోతున్నారు. కోవిడ్-19 కంటైన్‌మెంట్ జోన్లలో ఈ నెల 30 వరకు ఆంక్షలు కొనసాగుతాయి. 


ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించాలని స్పష్టం చేశారు. అన్‌లాక్‌ అంటే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అని అర్థం చేసుకోవద్దని ప్రజలను కోరారు. 


బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురి కన్నా ఎక్కువ మంది చేరకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భౌతిక దూరం నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. తరచూ గస్తీ తిరగాలని పోలీసులను ఆదేశించారు. 


ఈ నెల 15 నుంచి 30 వరకు ఒక కోటి పని దినాలను సృష్టించడానికి తగిన ప్రణాళికను సిద్ధం చేయాలని హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి స్వరాష్ట్రానికి వచ్చిన కూలీలు, కార్మికులకు ఉపాధి కల్పించడంపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు.


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ పరిథిలోకి వీథి వ్యాపారులు వచ్చే విధంగా చూడాలని తెలిపారు. వీథి వ్యాపారులకు ఉపాధి కల్పించాలన్నారు. 


Updated Date - 2020-06-06T23:53:23+05:30 IST