యోగి లెక్కల టీచర్‌ను పెట్టుకోవాలి : అఖిలేశ్ యాదవ్

ABN , First Publish Date - 2022-01-14T22:57:36+05:30 IST

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు రోజు రోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి

యోగి లెక్కల టీచర్‌ను పెట్టుకోవాలి : అఖిలేశ్ యాదవ్

లక్నో : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు రోజు రోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఘాటుగా స్పందిస్తున్నారు. బీజేపీ నుంచి కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు తన పార్టీలో చేరడంతో అఖిలేశ్ మరింత దూకుడు పెంచారు. 


యోగి ఆదిత్యనాథ్ ఇటీవల మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో 80 శాతం మంది ఒకవైపు, 20 శాతం మంది మరొక వైపు ఉన్నారని అన్నారు. ఆయన రాష్ట్రంలోని హిందూ, ముస్లిం జనాభాను ఈ విధంగా పరోక్షంగా ప్రస్తావించారు. దీనిపై అఖిలేశ్ యాదవ్ శుక్రవారం స్పందిస్తూ, బీజేపీకి 20 శాతం స్థానాలు, సమాజ్‌వాదీ పార్టీకి 80 శాతం స్థానాలు లభిస్తాయనేది  యోగి వ్యాఖ్యల సారాంశమని చెప్పారు. యోగి ఓ లెక్కల మాస్టారును నియమించుకోవాలన్నారు. ఇద్దరు మాజీ మంత్రులు, వెనుకబడిన తరగతుల నేతలు సమాజ్‌వాదీ పార్టీలో చేరిన సందర్భంగా అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 


రాష్ట్రంలోని 403 స్థానాల్లో మూడింట రెండొంతుల స్థానాలు తమకే లభిస్తాయని బీజేపీ ధీమా వ్యక్తం చేసిన నేపథ్యంలో అఖిలేశ్ స్పందిస్తూ, తమకు మూడు లేదా నాలుగు స్థానాలు మాత్రమే దక్కుతాయని బీజేపీ నేతలు భావిస్తున్నారని చెప్పారు. 


తాము శాసన సభ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నామని, తమ సైకిల్ హ్యాండిల్, చక్రాలు చాలా బాగున్నాయని, దీనిపై సవారీ చేయడానికి చాలా మంది ఉన్నారని చెప్పారు. సమాజ్‌వాదీలు, అంబేద్కర్‌వాదులు ఏకమయ్యామని, ఇక తమను ఎవరూ ఆపలేరని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ అనే విషయం తెలిసిందే.


Updated Date - 2022-01-14T22:57:36+05:30 IST