రాహుల్, ప్రియాంకకు లైన్ క్లియర్.. దిగొచ్చిన యోగి సర్కార్

ABN , First Publish Date - 2021-10-06T19:44:21+05:30 IST

హింసాత్మక ఘటనల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయిన లఖింపూర్ ఖేరిలో పర్యటించేందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ..

రాహుల్, ప్రియాంకకు లైన్ క్లియర్.. దిగొచ్చిన యోగి సర్కార్

లక్నో: హింసాత్మక ఘటనల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయిన లఖింపూర్ ఖేరిలో పర్యటించేందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారంనాడు అనుమతి ఇచ్చింది. ప్రియాంక గాంధీని లఖింపూర్ చేరకుండా రెండ్రోజుల క్రితమే పోలీసులు అడ్డుకుని గెస్ట్ హౌస్‌కు తరలించగా, రాహుల్ గాంధీ బుధవారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘెల్, పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని తీసుకుని న్యూఢిల్లీ నుంచి లక్నోకు విమానంలో బయలుదేరారు. ఈ నేపథ్యంలో రాహుల్, ప్రియాంక‌, మరో ముగ్గురిని లఖింపూర్‌లో పర్యటించేందుకు ప్రభుత్వం అనుమతించినట్టు రాష్ట్ర హోం శాఖ ప్రకటన విడుదల చేసింది.


కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం, రాహుల్ సారథ్యంలోని ఐదుగురు ప్రతినిధుల బృందం లఖింపూర్‌లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శిస్తుంది. కాగా, రాహుల్ పర్యటనకు అనుమతించాలంటూ కాంగ్రెస్ ఇంతకు ముందు రాసిన లేఖను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తోసిపుచ్చింది. శాంతి భద్రతల పరిస్థితి దృష్ట్యా అనుమతి నిరాకరిస్తున్నట్టు పేర్కొంది. అయినప్పటికీ రాహుల్ పర్యటనకు బయలుదేరారు. ఈ క్రమంలో రాహుల్, ప్రియాంక, మరో ముగ్గురిని లఖింపూర్‌లో పర్యటనకు అనుమతిస్తున్నట్టు హోం శాఖ తాజా ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - 2021-10-06T19:44:21+05:30 IST