వచ్చే ఏడాది మార్చి వరకు free ration పంపిణీ
ABN , First Publish Date - 2021-12-10T13:05:14+05:30 IST
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పేదలకు ఉచితంగా రేషన్ పంపిణీపై యూపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది....
ఎన్నికల నేపథ్యంలో యూపీ సర్కారు ఉత్తర్వులు
లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పేదలకు ఉచితంగా రేషన్ పంపిణీపై యూపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది.డిసెంబరు 12వతేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి నెల వరకు రేషన్ కార్డుదారులకు ఉచితంగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డుదారులకు గోధుమలు, బియ్యం, లీటరు రిఫైండ్ ఆయిల్, కిలో ఉప్పు, పప్పులను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు యూపీ సర్కారు ప్రకటించింది. ఎంపీలు, స్థానిక ప్రజా ప్రతినిధుల ద్వారా రేషన్ పంపిణీ చేయాలని సర్కారు ఆదేశించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం గడవు నవంబరు 3వతేదీతో ముగిసింది.
దీంతో తాము వచ్చే ఏడాది మార్చి వరకు ఉచిత రేషన్ ఇస్తామని యూపీ సీఎం యోగి ప్రకటించారు. కరోనా మొదటి వేవ్ సందర్భంగా గత సంవత్సరం ఏప్రిల్ నుంచి 128లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలను ఉచితంగా పంపిణీ చేశారు. 15 లక్షల మంది ప్రజలకు ఈ పథకం కింద ఆహారధాన్యాలతోపాటు వంటనూనె, ఉప్పు,పప్పులను రాష్ట్రప్రభుత్వం ఉచితంగా అందజేసింది.ఈ పథకం కింద ప్రతీ నెలా ఒక్కో లబ్ధిదారుడికి 10కిలోల చొప్పున ఆహారధాన్యాలను అందజేశారు.