తీవ్ర అనారోగ్యంతో ICUలో మాజీ ఐఏఎస్ లక్ష్మీ నారాయణ.. డిశ్చార్జ్ చేస్తేనే..!
ABN , First Publish Date - 2021-12-13T18:02:30+05:30 IST
ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యకలాపాల్లో అక్రమాలు జరిగాయంటూ...
అమరావతి/హైదరాబాద్ సిటీ : ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యకలాపాల్లో అక్రమాలు జరిగాయంటూ... రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీనారాయణ నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం లక్ష్మీనారాయణ తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లోని స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 10న సీఐడీ తనిఖీల జరుపుతుండగా ఇంట్లో ఆయన స్పృహ తప్పి పడిపోయారు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. ఐసీయూలో డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు.
అయితే.. ఇవాళ విచారణకు హాజరు కావాలని మంగళగిరి సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 12 గంటల తర్వాత లక్ష్మీ నారాయణ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలించనున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి డిశ్చార్జ్పై డాక్టర్లు నిర్ణయం తీసుకోనున్నారు. వైద్యులు డిశ్చార్జ్ చేస్తేనే సీఐడీ కార్యాలయానికి లక్ష్మీ నారాయణ వెళ్లే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఎ2గా లక్ష్మీనారాయణ ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేయడం జరిగింది. పిటీషన్ను కూడా హైకోర్టు అనుమతించింది. ఇవాళ మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.