India-UAE flights: ప్రయాణికులు తమతోపాటు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిన ధృవపత్రాలివే..

ABN , First Publish Date - 2021-08-13T14:56:55+05:30 IST

భారత్ నుంచి యూఏఈ వెళ్లే ప్రయాణికులకు బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తాజాగా కీలకమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.

India-UAE flights: ప్రయాణికులు తమతోపాటు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిన ధృవపత్రాలివే..

న్యూఢిల్లీ: భారత్ నుంచి యూఏఈ వెళ్లే ప్రయాణికులకు బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తాజాగా కీలకమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రధానంగా ప్రయాణికులు తమతోపాటు తీసుకెళ్లాల్సిన ధృవపత్రాలపై ఈ గైడ్‌లైన్స్‌లో వివరించింది. భారత్ నుంచి యూఏఈ వెళ్లే ప్రయాణికులు ఆ దేశ రెసిడెన్సీ వీసా కలిగి ఉండడం తప్పనిసరి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ గురువారం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రయాణ సమయంలో ప్రయాణికులు తమతోపాటు తీసుకెళ్లాల్సిన ధృవపత్రాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం...


* దుబాయ్ రెసిడెన్సీ వీసా కలిగి ప్రయాణికులు దుబాయ్ నగరానికి వెళ్లేటప్పుడు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (జీడీఆర్ఎఫ్ఏ) నుంచి పొందిన రిటర్న్ పర్మిట్(యూఏఈ వెలుపల నివాసితులకు) తప్పనిసరి. దీనిని https://smart.gdrfad.gov.ae/Smart_OTCServicesPortal/ReturnPermitService.aspx లింక్ ద్వారా పొందవచ్చు.


* ఇతర ఎమిరేట్స్‌లో జారీ చేయబడిన రెసిడెన్సీ వీసాలను కలిగి ఉన్నవారు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ (ఐసీఏ) నుండి https://smartservices.ica.gov.ae/echannels/web/client/guest/index.html#/registerArrivals ద్వారా ఫారం పొందాలి. అయితే, ఎక్స్‌పో 2020 దుబాయ్ నిర్వాహకులు జారీ చేసిన వీసాలు ఉన్నవారు జీడీఆర్ఎఫ్ఏ/ఐసీఏ అనుమతులు లేకుండా యూఏఈకి వెళ్లవచ్చు.


* ప్రయాణికులు తప్పనిసరిగా క్యూఆర్ కోడ్‌తో కూడిన కరోనా నెగెటివ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అది కూడా ఐసీఎంఆర్ ఆమోదం పొందిన లాబొరేటరీలో ప్రయాణానికి 48 గంటల ముందు టెస్టు చేయించుకున్నదై ఉండాలి. 


* యూఏఈకి బయల్దేరడానికి నాలుగు గంటలలోపు ఇండియన్ డిపార్చర్ విమానాశ్రయంలో ర్యాపిడ్ పీసీఆర్ పరీక్ష చేయించుకోవడంతో పాటు దాని తాలుకూ రిపోర్టును ఆ దేశంలో ల్యాండైన విమానాశ్రయంలో చూపించడం తప్పనిసరి. కాగా, గురువారం విడుదల చేసిన మార్గదర్శకాలలో కోవిడ్-19 టీకా సర్టిఫికెట్‌కు సంబంధించి ఎలాంటి విషయాన్ని పేర్కొనలేదు.


అలాగే అబుధాబి, రాస్ అల్ ఖైమా వెళ్లే ప్రయాణికులకు కొన్ని కీలక సూచనలు చేసింది. విమానాశ్రయాలకు ఆరుగంటల ముందే చేరుకోవాలని కోరింది. ర్యాపిడ్ పీసీఆర్ టెస్టింగ్ కౌంటర్లు పరీక్షలు చేసుకోవడం తప్పనిసరి. అబుధాబి వెళ్లేవారు 12 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. ఆరు, పదకొండో రోజున పీసీఆర్ ఉంటుంది. రాస్ అల్ ఖైమా వెళ్లేవారు 10 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి. నాలుగు, ఎనిమిదో రోజున పీసీఆర్ ఉంటుంది. 

Updated Date - 2021-08-13T14:56:55+05:30 IST