‘విద్యార్థుల హాజరు బాధ్యత అధ్యాపకులదే’
ABN , First Publish Date - 2021-06-24T04:50:02+05:30 IST
ఆన్లైన్ క్లాసులకు విద్యార్థుల హాజరు బాధ్యత అధ్యాపకులదేనని ఉర్దూ యూనివర్సిటీ రిజిస్ట్రార్, ప్రొఫెసర్ బాయినేని శ్రీనివాసులు తెలిపారు.
కర్నూలు(అర్బన్), జూన్ 23: ఆన్లైన్ క్లాసులకు విద్యార్థుల హాజరు బాధ్యత అధ్యాపకులదేనని ఉర్దూ యూనివర్సిటీ రిజిస్ట్రార్, ప్రొఫెసర్ బాయినేని శ్రీనివాసులు తెలిపారు. బుధవారం డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీలో ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై ఆన్లైన్ పద్ధతిలో సమీక్షించారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ ఆన్లైన్ క్లాసుల తీరు, ఆధ్యాపకుల వర్క్ లోడ్, సిలబస్ పూర్తి అయిన శాతం, సెమిస్టర్ పరీక్షల నిర్వహణ, విద్యార్థుల హాజరు శాతం, పరిశోధన పత్రాల ప్రచురణ తదితర అంశాలపై వివిధ విభాగాల వారీగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉంటే ఉపేక్షించేది లేదన్నారు. విదార్ధులు క్రమం తప్పకుండా ఆన్లైన్ క్లాసులకు హాజరు అయ్యేలా అధ్యాపకులు తమ బాధ్యతగా తీసుకొని అవగాహన కల్పించాలన్నారు. ప్రతి అధ్యాపకుడు వర్క్ లోడ్ ప్రకారం 16 గంటలు తప్పకుండా క్లాసులు తీసుకోవాల్సిందేని స్పష్టం చేశారు. విద్యార్థులు 75 శాతం హాజరు లేక పోతే ప్రభుత్వం ఇచ్చే జగన్ అన్న విద్యా దీవెన, జగన్ అన్న వసతి దీవెనకు అనర్హులవుతారని తెలిపారు. వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.