నేటి నుంచి ఉర్సు ఉత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-03T06:07:57+05:30 IST

జిల్లాకేంద్రంలోని క్లాక్‌టవర్‌ సెంటర్‌లో హజ్రత్‌ సయ్యద్‌ షా లతీపుల్లా ఖాద్రి ఉర్సు ఉత్సవాలు గురువారం లాంఛనంగా ప్రారంభంకానున్నాయి.

నేటి నుంచి ఉర్సు ఉత్సవాలు ప్రారంభం
ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న దర్గా కమిటీ సభ్యులు

నల్లగొండ కల్చరల్‌, డిసెంబరు 2 : జిల్లాకేంద్రంలోని క్లాక్‌టవర్‌ సెంటర్‌లో హజ్రత్‌ సయ్యద్‌ షా లతీపుల్లా ఖాద్రి ఉర్సు ఉత్సవాలు గురువారం లాంఛనంగా ప్రారంభంకానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే  ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు తగినట్లుగా  అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. దర్గాను వివిధ రంగులు, విద్యుద్దీపాలతో అలంకరించారు. ఉర్సుకు హాజరయ్యే భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఉర్సు ఉత్సవాలకు జిల్లా నుంచే గాక రాష్ట్రంలోని   పలు జిల్లాల నుంచి భక్తులు హాజరవుతారు. భక్తులకు ఇబ్బంది లేకుండా  వివిధ శాఖల అధికారులు పనులు పూర్తి చేశారు. మధ్యాహ్నం 4గంటలకు స్థానిక మదీన మసీదులో గంధానికి ప్రత్యేకంగా ప్రార్థనలు చేశాక  పట్టణ పుర వీధుల వెంట ఊరేగింపు సాగనుంది. రాత్రి 9గంటలకు గుట్ట మెట్ల వ ద్దకు ఆ గంధం చేరుకోగానే జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగ తం పలికి ఉర్సు ఉత్సవాలను ప్రారంభిస్తారు. అనంతరం ముతవల్లి ధర్మక్రియలు, మిలాద్‌ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. గంధం వెంట పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి దట్టీలు ఊరేగించి గుట్ట మెట్ల వద్దకు చేరుస్తారు. దీంతో పాటు ప్రత్యేకంగా పోలీస్‌ శాఖ గంధం సైతం జిల్లా పోలీస్‌ కార్యాలయం నుంచి బయలుదేరుతుంది. గంధం, దట్టీ ఊరేగింపులో యువకులు ఉత్సాహంగా భక్తిగీతాలు ఆలపిస్తారు. బుధవారం రాత్రి ఏర్పాట్లను దర్గా ముతవల్లు, కమిటీ సభ్యులు జమాల్‌ ఖాద్రి, సయ్యద్‌ సమి ఉల్లాఖాఽద్రి,  గౌస్‌ ఉల్లాఖాద్రి, సల్మాన్‌ ఖాద్రి, అశ్వక్‌, అబ్రహర్‌ పర్యవేక్షించారు. 

Updated Date - 2020-12-03T06:07:57+05:30 IST