రంగలీల ఉత్సవాలు గర్వకారణం
ABN , First Publish Date - 2021-10-17T06:12:45+05:30 IST
రంగలీల ఉత్సవాలు గర్వకారణం
భవిష్యత్తులో దేశంలోనే నెంబర్వన్గా నిలవాలి
అజాంజాహి మిల్లు దగ్గర ‘వరంగల్ కలెక్టరేట్’
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు
ఏకశిలనగర్ (వరంగల్), అక్టోబరు 16 : దసరా పండుగ సందర్భంగా ప్రతీ ఏటా ఉర్సు గుట్ట రంగలీల మైదానంలో నిర్వహిస్తున్న రావణ వధ ఘట్టం ఓరుగల్లుకే గర్వకారణమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొనియాడారు. ఈ ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రంలో నెంబర్వన్గా నిలిచాయని కితాబునిచ్చారు. రంగలీల మైదానంలో శుక్రవారం రాత్రి జరిగిన రావణవధ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంగలీల మైదానంలో 85 ఏళ్ల నుంచి దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నారని, గత 40 ఏళ్లుగా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు కమిటీని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాలను భవిష్యత్తులో మరింత ఘనంగా నిర్వహించి, దేశంలో నెంబర్వన్ స్థాఽయికి తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా తన సహాయసహకారాలను అందిస్తానన్నారు. వరంగల్ ప్రాంత రూపురేఖలు మారనున్నాయని, అజాంజాహి మిల్లు దగ్గర సుమారు 30 ఎకరాలలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్న దసరా ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్వన్గా నిలిచినందుకు సంతోషంగా ఉందని అన్నారు. వరంగల్ను అభివృద్ధిలో రాష్ట్రంలో నెంబర్వన్గా నిలిచేలా కృషి చేస్తానన్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోలేకపోయామని, ఈ సారి ఘనంగా నిర్వహించినా.. పోలీసు శాఖ ఏర్పాట్లపరంగా విఫలమైందని అసహనం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణ, నిర్వహణలో పోలీసులు చేతులెత్తేసిన పరిస్థితి కనిపించిందని అన్నారు. వరంగల్ను జిల్లా హెడ్క్వార్టర్గా చేయడం జరిగిందని, రూ.20 కోట్లతో ఉర్సు బండ్ను నిర్మిస్తామని, ఇందుకు టెండర్ ప్రక్రియ పూర్తయినట్టు తెలిపారు.
సమావేశంలో దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగపురి సంజయ్బాబు ప్రధానకార్యదర్శి బండి కుమారస్వామి, కోశాధికారి మండ వెంకన్న, ఉత్సవ కమిటీ కన్వీనర్ వొడ్నాల నరేందర్, గోనె రాంప్రసాద్, వంగిరి కోటేశ్వర్, మేడిది మధుసూదన్, వెలిదె శివమూర్తి, వంచనగిరి సమ్మయ్య, వొగిలిశెట్టి అనిల్కుమార్, నాగపురి రంజిత్, పోగాకు సందీప్, సుంకరి సంజీవ్, వెలగందుల సుధాకర్, బజ్జూరి వాసు, పూదరి అజయ్, నాగపురి అశోక్, మహేష్, బత్తిని అఖిల్గౌడ్, నరిగె శ్రీను, నాగపురి సంతోష్, బిట్ల సతీష్, అంబేద్కర్, పొగాకు చిరంజీవి, గట్టు గోవర్థన్, బైరగోని మనోహార్, కస్తూరి వంశీ, బత్తిని రంజిత్ తదితరులు పాల్గొన్నారు.