భారత టెకీలకు బంపర్ ఆఫర్.. కొత్తగా 7 వేల మంది ఇంజినీర్లను నియమించుకోనున్న అమెరికా కంపెనీ

ABN , First Publish Date - 2021-11-23T21:55:20+05:30 IST

భారతీయ టెకీలకు బంపర్ ఆఫర్! అమెరికా టెక్ సంస్థ యూఎస్‌టీ ఇండియాలో భారీ ఎత్తున నియామకాలు చేపట్టేందుకు సిద్ధమైంది. సంస్థకు చెందిన బెంగళూరు, హైదరాబాద్ కార్యాలయాల్లో 2023 కల్లా పెద్ద ఎత్తున సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను నియమించుకోనుంది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయనున్నట్టు సంస్థ తాజాగా ప్రకటించింది.

భారత టెకీలకు బంపర్ ఆఫర్.. కొత్తగా 7 వేల మంది ఇంజినీర్లను నియమించుకోనున్న అమెరికా కంపెనీ

బెంగళూరు: భారతీయ టెకీలకు బంపర్ ఆఫర్! అమెరికా టెక్ సంస్థ యూఎస్‌టీ ఇండియాలో భారీ ఎత్తున నియామకాలు చేపట్టేందుకు సిద్ధమైంది. సంస్థకు చెందిన బెంగళూరు, హైదరాబాద్ కార్యాలయాల్లో  2023 కల్లా పెద్ద ఎత్తున సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను నియమించుకోనుంది. వ్యాపార విస్తరణలో భాగంగా పెరిగిన డిమాండ్‌కు అనుగూణంగా ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయనున్నట్టు సంస్థ తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం యూఎస్‌టీ బెంగళూరు కార్యాలయంలో 6 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంఖ్యను 12 వేలకు చేర్చేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందించుకుంది. ‘‘వచ్చే 18-24 నెలల్లో బెంగళూరు సెంటర్‌లో ఫ్రెషర్లు, అనుభవజ్ఞులను నియమించుకుంటాము. హెల్త్‌కేర్, లాజిస్టిక్స్, సెమీ కండక్టర్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ విభాగాల్లో కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటాం.’’ అని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. 


యూఎస్‌టీ హైదరాబాద్ శాఖలో ప్రస్తుతం 1000 మంది పనిచేస్తుండగా.. మరో రెండేళ్లలో అదనంగా వెయ్యి మందిని నియమించుకునేందుకు కూడా కంపెనీ సిద్ధమవుతోంది. అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న యూఎస్‌టీకి 25 దేశాల్లో 35 కార్యాలయాలు ఉన్నాయి. సంస్థకు హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, పూణె, కొయంబత్తూర్, హోసూర్, ఢిల్లీ నగరాల్లో సాఫ్ట్‌వేర్ డెలివరీ కేంద్రాలు ఉన్నాయి. 


భారత్‌లో తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని యూఎస్‌టీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అలెగ్జాండర్ వర్ఘీస్ పేర్కొన్నారు. యూఎస్‌టీ సంస్థకు ఉన్న అతిపెద్ద కార్యాలయాల్లో బెంగళూరు ఆఫీసు కూడా ఒకటని తెలిపారు. కొత్తగా నియామకాలు చేపట్టడంతో పాటూ ప్రపంచవ్యాప్తంగా సంస్థకు ఉన్న క్లైంట్లకు అద్భుత సేవలను అందిస్తామని ఆయన చెప్పారు. 


బెంగళూరులో క్రమంగా విస్తరిస్తున్న యూఎస్‌టీకి కర్ణాటక ఐటీ, బయోటెక్ శాఖ అదనపు చీఫ్ సెక్రెటరీ డా. ఇ.వి.రమణారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు.. యూఎస్‌టీ ప్రపంచవ్యాప్తంగా కూడా 10 వేల మంది టెకీలను నియమించుకునేందుకు ప్రణాళికలు రూపొందించింది. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇన్‌ఫ్రా‌‌స్ట్రక్చర్, జావా, డాటా సైన్స్ అండ్ ఇంజినీరింగ్, అప్లికేషన్ డెవలెప్‌మెంట్ అండ్ మోడర్నైజేషన్, కృత్రిమ మేధ/మెషీన్ లెర్నింగ్ ఆటోమేషన్ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టనుంది.   

Updated Date - 2021-11-23T21:55:20+05:30 IST