యూఎస్లో 5వేలు దాటిన కరోనా మరణాలు...
ABN , First Publish Date - 2020-04-02T16:52:28+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ అల్లాడిస్తోంది. యూఎస్పై విరుచుకుపడుతున్న ఈ మహమ్మారిపై ఇప్పటి వరకు 5,110 మందిని పొట్టనబెట్టుకుంది.
వాషింగ్టన్ డీసీ: అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ అల్లాడిస్తోంది. యూఎస్పై విరుచుకుపడుతున్న ఈ మహమ్మారిపై ఇప్పటి వరకు 5,110 మందిని పొట్టనబెట్టుకుంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 2,15,417 నమోదయ్యాయి. అటు మరణాల్లో ఇటలీ(13,155), స్పెయిన్(9,385)ల కంటే తక్కువగా ఉన్నా... ఈ వైరస్ పురుడుపోసుకున్న చైనా(3,312)ను మాత్రం అగ్రరాజ్యం దాటేసింది. గత వారం రోజులుగా వరుసగా వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం అక్కడ కొవిడ్-19 ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో తెలియజేస్తుంది. యూఎస్లో కేవలం 24 గంటల వ్యవధిలోనే 884 మంది చనిపోవడం బాధాకరం.
ఒక్క న్యూయార్క్ నగరంలోనే 83,901 మంది కరోనా బాధితులుండగా, 2,219 మంది మృత్యువాత పడ్డారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం 2,15,417 కరోనా పాజిటివ్ కేసులతో అగ్రరాజ్యం అగ్రస్థానంలో ఉంది. ఇటు భారత్లో కూడా ఈ మహమ్మారి విజృంభిస్తోంది. బుధవారం రాత్రి 11.45 గంటల వరకు దేశ వ్యాప్తంగా 1996 కేసులు నమోదయ్యాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే కరోనా కేసులు రెట్టింపు అయ్యాయి. కరోనా బారినపడి చనిపోయి వారి సంఖ్య 58కి చేరింది. అటు తబ్లిగీ జమాత్ నేపథ్యమే దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడానికి కారణమైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.