270 డాలర్ల బిల్.. 2020 డాలర్ల టిప్!
ABN , First Publish Date - 2021-01-03T01:58:06+05:30 IST
2020 టిప్ చాలెంజ్ సర్వర్ల ముఖాల్లో వెలుగులు నింపుతోంది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు హోటళ్లు, రెస్టారెంట్లు
ఫ్లోరిడా: 2020 టిప్ చాలెంజ్ సర్వర్ల ముఖాల్లో వెలుగులు నింపుతోంది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడ్డాయి. వేలాదిమంది సర్వర్లు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు. పరిస్థితులు కొంత అనుకూలించడంతో వ్యాపార కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. అయితే, కరోనా కారణంగా అతలాకుతలమైన జీవితాల నుంచి మాత్రం ప్రజలు ఇంకా బయటపడడం లేదు. ఇక, రెస్టాంరెట్లు, అందులోని సర్వర్ల పరిస్థితి మరింత దారుణం. ఈ నేపథ్యంలో ఇటీవల కొందరు దయార్థ్ర హృదయులు సామాజిక మాధ్యమాల్లో విసురుతున్న ‘2020 టిప్ చాలెంజ్’ సర్వర్ల ముఖాల్లో వెలుగుపూలు పూయిస్తోంది. ఈ చాలెంజ్లో పాల్గొంటున్న చాలామంది సర్వర్లకు 20.20 లేదంటే 2020 డాలర్లు టిప్గా ఇస్తూ దయాగుణాన్ని చాటుకుంటున్నారు.
ఈ క్రమంలో అమెరికాలోని ఓ రెస్టారెంట్ సర్వర్కు ఓ వ్యక్తి 2020 డాలర్లు టిప్గా ఇవ్వడం ఇప్పుడు వైరల్ అయింది. ఫ్లోరిడాలోని భారతీయ రెస్టారెంట్ ‘మసాలా మంత్ర ఇండియన్ బిస్ట్రో’లో ఓ వ్యక్తి 270 డాలర్ల బిల్కు గాను.. తనకు వడ్డించిన సర్వర్కు అదనంగా 2020 డాలర్లు టిప్గా ఇచ్చి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఆ రెస్టారెంట్ ఫేస్బుక్ ద్వారా పంచుకుంది.
‘‘తమ సర్వర్ డాన్కు 2020 డాలర్ల టిప్ ఇచ్చి ఆ వ్యక్తి పెద్ద మనసు చాటుకున్నాడు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వారిని ఆ దేవుడు చల్లాగా చూస్తాడు. మాతో సహా ఈ ఏడాది ప్రతీ రెస్టారెంటుకు గడ్డుకాలమే. ఇలాంటి దయామయుల మద్దతుకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఈ కష్టకాలంలో వారు మా సర్వర్ల జీవితాల్లో ఆనందాలు నింపారు’’ అని పేర్కొంటూ బిల్లును షేర్ చేసింది. అయితే, టిప్ ఇచ్చిన వ్యక్తి పేరును మాత్రం వెల్లడించలేదు. రెస్టారెంట్ పోస్టు తర్వాత కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. టిప్ ఇచ్చిన వ్యక్తిపై ప్రశంసలు కురుస్తున్నాయి.