హిందీ పాట పాడిన అమెరికన్ నేవీ.. వైరలవుతున్న వీడియో!
ABN , First Publish Date - 2021-03-30T17:38:42+05:30 IST
అమెరికాలోని భారత రాయబారి తరంజీత్ సింగ్ సంధు షేర్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
వాషింగ్టన్: అమెరికాలోని భారత రాయబారి తరంజీత్ సింగ్ సంధు షేర్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అమెరికన్ నేవీ బ్యాండ్ హిందీ పాటను ఆలపించడం ఈ వీడియోలో ఉంది. వివరాల్లోకి వెళ్తే.. అగ్రరాజ్యం అమెరికా నేవీ బృందం ఇండియా కోసం హిందీ పాటను ఆలపించిన అరుదైన సంఘటన ఇది. యూఎస్ చీఫ్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్, భారత రాయబారుల డిన్నర్ మీట్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. యూఎస్ చీఫ్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్(సీఎన్ఓ) మైఖేల్ గిల్డే, అమెరికాలోని భారత రాయబారి తరంజీత్ సింగ్ సంధు శనివారం ఓ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా నేవీ బ్యాండ్ అతిథులను ఆనందపరిచేందుకు హిందీ పాటను పాడింది. 2004లో వచ్చిన బాలీవుడ్ మూవీ 'స్వదేశ్' చిత్రంలోని 'యే జో దేశ్ హై తేరా' పాటను నేవీ బ్యాండ్ ఆలపించింది. ఈ వీడియోను భారత రాయబారి ట్విటర్లో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. ఇప్పటి వరకు ఈ వీడియోను 3.93 లక్షల మంది వీక్షించగా.. 29 వేలకు పైగా మంది లైక్ చేశారు. ఇదిలాఉంటే.. 'స్వదేశ్' చిత్రంలో ఈ పాటను అస్కార్ అవార్డు విజేత, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చడంతో పాటు స్వయంగా పాడటం విశేషం.