2008 Mumbai attacks సూత్రధారి మసూద్ అజార్పై పాక్ చర్యలు తీసుకోలేదు...
ABN , First Publish Date - 2021-12-17T16:58:55+05:30 IST
2008 ముంబై దాడుల సూత్రధారి మసూద్ అజార్పై చర్య తీసుకోవడంలో పాకిస్థాన్ నిష్క్రియాపరత్వాన్ని అమెరికా నివేదిక బట్టబయలు చేసింది...
అమెరికా సంచలన నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: 2008 ముంబై దాడుల సూత్రధారి మసూద్ అజార్పై చర్య తీసుకోవడంలో పాకిస్థాన్ నిష్క్రియాపరత్వాన్ని అమెరికా నివేదిక బట్టబయలు చేసింది.ముంబై దాడుల సూత్రధారి మసూద్ అజార్, దాడి బృందం ప్రాజెక్ట్ మేనేజర్ సాజిద్ మీర్లపై పాకిస్థాన్ చర్య తీసుకోలేదని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ నివేదిక పేర్కొంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో పాకిస్థాన్ పరిమిత పురోగతి మాత్రమే సాధించిందని, మసూద్ అజార్ వంటి వ్యక్తులు భారత్ను లక్ష్యంగా చేసినా ఉగ్రవాద సంస్థల నేతలను విచారించలేదని అమెరికా విదేశాంగ శాఖ నివేదిక వెల్లడించింది.తీవ్రవాదంపై కంట్రీ రిపోర్ట్స్ 2020 నివేదికలో యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఉగ్రవాది మసూద్ అజార్పై చర్యలు తీసుకోలేదని పేర్కొంది.
జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు, గ్లోబల్ ఉగ్రవాది మసూద్ అజార్,ముంబై దాడి ప్రాజెక్ట్ మేనేజర్ సాజిద్ మీర్ వంటి ఉగ్రవాదులు పాకిస్థాన్లో స్వేచ్ఛగా ఉన్నారని యూఎస్ నివేదికలో పేర్కొంది.అఫ్ఘానిస్థాన్లో సర్కారు నెలకొల్పిన తాలిబాన్లను అభినందించిన మసూద్ అజార్, అమెరికా ఇకపై సూపర్ పవర్ కాదని పేర్కొన్నాడు.లష్కరే తయ్యిబా (ఎల్ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్తో పాటు మరో నలుగురు సీనియర్ ఎల్ఈటీ నేతలను పలు తీవ్రవాద ఫైనాన్సింగ్ కేసుల్లో దోషులుగా నిర్ధారించడం వంటి కొన్ని సానుకూల చర్యలను పాకిస్థాన్ తీసుకుందని అమెరికా నివేదిక పేర్కొంది.